ఆప్ కు షాక్ ఇస్తున్న ఆ పార్టీ ఎమ్మెల్యేలు... బీజేపీలోకి క్యూ
ఎన్నికల వేళ ఢిల్లీలో ఆప్ మరియు బీజేపీ ల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. మరోవైపు ఆప్ ఎమ్మెల్యేలు ఎన్నికలకు మరో పది రోజులు ఉన్న నేపథ్యంలోనే ఆపార్టీకి షాక్ ఇస్తున్నారు. ఆప్ నాయకుడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తమ ఎమ్మెల్యేలను కొనలేరని అని చెప్పిన కొద్ది గంటల్లోనే ఆప్ కు చెందిన మరో ఎమ్మెల్యే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
14 మంది ఆప్ ఎమ్మెల్యే టచ్లో ఉన్నారు , కేంద్రమంత్రి
ఢిల్లీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజకీయం మరింత వేడేక్కుతుంది. ఆప్ నుండి ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్ అవుతున్నారు. ఈనేపథ్యంలోనే ఆప్ కు చెందిన 14 ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ ఉన్నారని వారు పార్టీలోకి వచ్చేందుకు సిద్దంగా ఉన్నారని కేంద్రమంత్రి గోయల్ వ్యాఖ్యానించారు. ఈనేపథ్యంలోనే ఏడుగురు ఎమ్మెల్యేలు పార్టీలోకి వచ్చేందుకు సిద్దంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రచారాన్ని నిజం చేస్తు ఆప్ ఎమ్మెల్యే బీజేపీలో చేరారు.
కేంద్రమంత్రి వ్యాఖ్యలపై మండిపడ్డ కేజ్రీవాల్
కాగా కేంద్రమంత్రి విజయ్ గోయల్ వ్యాఖ్యలపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మండిపడ్డారు. తమ ఎమ్మెల్యేలను కొనాలంటే తాతలు దిగిరావాలని హెచ్చరించారు. ఎమ్మెల్యేలను కొనడం అంత సులభం కాదని కూడ పేర్కోన్నారు. పనిలో పనిగా ఎమ్మెల్యేలు ఎంత అడిగారు ? ప్రధాని ఎంత ఇస్తామని చెప్పారని ట్విట్టర్లో ఘాటుగా స్పందించారు. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఎమ్మెల్యేలు కొనుగోలు చేసి ప్రభుత్వాలను మోడీ కూల్చేస్తారా అంటూ దుయ్యబట్టారు.
కేజ్రీవాల్ స్పందించిన కొద్దిగంటల్లోనే ఎమ్మెల్యే జంప్
కాగా ఓ వైపు కేజ్రీవాల్ బీజేపీపై విరుచుకుపడుతున్న నేపథ్యంలోనే ఆపార్టీ ఎమ్మెల్యే ఆప్ని వీడారు . మంత్రి విజయ్ గోయాల్ చెప్పినట్టుగా ఢిల్లీలోని గాంధినగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అనిల్ బాజ్పేయి కేజ్రీవాల్ కు షాక్ ఇచ్చారు. ఎమ్మెల్యే బాజ్పాయి శుక్రవారం సాయంత్రం ఢిల్లీ పార్టీ ఇంచార్జ్ శ్యామ్ జాజు మరియు కేంద్రమంత్రి విజయ్ గోయల్ సమక్షంలో ఢిల్లీ బీజేపీ కార్యాలయంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా కొద్ది రోజుల వ్యవధిలోనే ఇద్దరు ఆప్ ఎమ్మెల్యేలు బీజేపీ తీర్థం పుచ్చుకొవడం ఢిల్లి రాజకీయాలు మరింత వేడేక్కాయి.