బెయిల్ పిటిషన్ కొట్టివేత: ఆప్ ఎమ్మెల్యే అరెస్ట్..?
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే, ఢిల్లీ మాజీ మంత్రి సోమ్నాథ్ భారతి అరెస్టుకు రంగం సిద్ధమైంది. గృహహింస కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన ముందస్తు బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు మంగళవారం కొట్టివేసింది.
అంతక ముందు సిటీ కోర్టు ఆయన బెయిల్ పిటిషన్ను కొట్టి వేసిన నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ బెయిల్ పిటిషన్ను విచారించిన జస్టిస్ సురేష్ కైత్ మంగళవారం ఈ ఆదేశాలు జారీ చేసారు. దీంతో సోమ్నాథ్ భారతి ఢిల్లీ పోలీసులు ఏ క్షణమైనా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.
సోమ్నాథ్ భారతిపై ఆయన భార్య లిపిక ఈ ఏడాది జులై 10న మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు. తనను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారని ఆమె తన ఫిర్యాదులో ఆరోపించారు. తన పెంపుడు కుక్క లాబ్రడార్ను తనపైకి ఉసిగొల్పి హత్య చేయడానికి ప్రయత్నించారని అన్నారు.
దీంతో సోమ్నాథ్ భారతిపై గృహహింస, హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు సోమ్నాథ్ భారతి విచారణకు సహకరించడం లేదని ఆరోపిస్తూ నోటీసులు జారీ చేశారు. దీంతో ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది.
తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తమని పేర్కొంటూ, తనపై జారీ చేసిన అరెస్ట్ వారెంట్ను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ పెట్టుకున్నారు. ఈ పిటిషన్ను విచారించిన ఢిల్లీ హైకోర్టు మంగళవారం కొట్టివేసింది.