ఈసీ ఇచ్చిన అవకాశాన్ని ఆప్ వినియోగించుకోలేదు: ఓం ప్రకాష్ రావత్
న్యూఢిల్లీ: ఈసీ ఇచ్చిన అవకాశాన్ని ఆప్ వినియోగించుకోకపోవడం వల్లే 20 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సి వచ్చిందని ఎన్నికల ప్రధానాధికారి ఓం ప్రకాష్ రావత్ చెప్పారు. రెండు దఫాలు ఆప్కు ఈ విషయమై వివరణ ఇవ్వాల్సిందిగా ఈసీ కోరితే ఎలాంటి సమాధానం ఇవ్వలేదని ఓం ప్రకాష్ రావత్ అభిప్రాయపడ్డారు.
సోమవారం నాడు ఓం ప్రకాష్ రావత్ ఈ విషయమై మీడియాతో మాట్లాడారు.అనర్హత అంశంపై వివరణ కోరుతూ ఈసీ.. 20 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు పంపింది. 2017 సెప్టెంబర్ 28న మొదటి, నవంబర్2న రెండోసారి నోటీసులు జారీ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
అయితే ఈ విషయమై ఆప్ ఎలాంటి సమాధానం ఇవ్వలేదని ఆయన చెప్పారు.ఈ నోటీసులకు సమాధానమివ్వకుండానే ఆప్ కోర్టును ఆశ్రయించిందని ఓం ప్రకాష్ రావత్ చెప్పారు.అసలు విచారణే వద్దని వాదించడం సమంజసం కాదన్నారు.
2015 లో ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం ఏర్పాటైంది. ఏడుగురికి మంత్రి పదవులిచ్చారు. మరో 20 మందిని పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ నియామకాలు చెల్లవని ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. పార్లమెంటరీ కార్యదర్శులను తొలగించరాదంటూ ఢిల్లీ అసెంబ్లీ చేసిన తీర్మాణాన్ని రాష్ట్రపతి కొట్టేశారు.
లాభదాయక పదవులను అనుభవించారని ఆరోపిస్తూ న్యాయవాది రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును రాష్ట్రపతి ఈసీకి పంపారు. ఈసీ ఈ కేసును విచారించింది.20 మంది ఆప్ ఎమ్మెల్యేలపై వేటు వేయాలంటూ రాష్ట్రపతికి ఈసీ సూచించింది. అలా అనర్హులైన 20 మంది.. సుప్రీంకోర్టును ఆశ్రయించే ప్రయత్నంలో ఉన్నారు.