ముందే ఓటమి అంగీకరించిన బీజేపీ- పోటీ నుంచి విత్ డ్రా
న్యూఢిల్లీ: దేశ రాజధాని ప్రథమ పౌరుడి ఎన్నికలో చోటు చేసుకున్న హైడ్రామాకు తెరపడింది. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలో భారతీయ జనతా పార్టీ ముందే ఓటమిని అంగీకరించింది. పోటీ నుంచి తప్పుకొంది. దీనితో ఆమ్ ఆద్మీ పార్టీ ఏకగ్రీవంగా విజయం సాధించింది. వరుసగా రెండోసారి- ప్రతిష్ఠాత్మక ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్పై జెండా పాతింది.
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ భవనంలో కొద్దిసేపటి కిందటే జరిగిన మేయర్ ఎన్నికలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన షెల్లీ ఓబెరాయ్.. వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. ఈ సారి ఆమె ఎన్నిక ఏకగ్రీవం అయింది. బీజేపీకి చెందిన గ్రేటర్ కైలాష్ కార్పొరేటర్ శిఖా రాయ్.. చివరి నిమిషంలో తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నారు. దీనితో షెల్లీ ఓబెరాయ్ ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసింది.

గత ఏడాది నవంబర్లో జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ తిరుగులేని విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో 15 సంవత్సరాల తరువాత బీజేపీ పరిపాలనకు ఆమ్ ఆద్మీ పార్టీ తెరదించింది. మొత్తం 250 వార్డులు ఉన్న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 134 చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు జెండా ఎగురవేశారు.
బీజేపీ 104 డివిజన్లకే పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ తొమ్మిది స్థానాలతో సరిపెట్టుకుంది. మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకోవాల్సి ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు షెల్లీ ఒబెరాయ్ను తమ మేయర్ అభ్యర్థిగా ప్రకటించింది. బీజేపీ నుంచి శిఖా రాయ్ రేసులో నిలిచారు. డిప్యూటీ మేయర్ రేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఆలె మహ్మద్ ఇక్బాల్, బీజేపీకి చెందిన సోనీ పాండే పోటీ పడ్డారు.
ప్రస్తుతం ఢిల్లీ మేయర్, డిప్యూటీ మేయర్గా షెల్లీ ఓబెరాయ్, మహ్మద్ ఇక్బాల్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 22వ తేదీన ఢిల్లీ మేయర్గా షెల్లీ ఓబెరాయ్, డిప్యూటీ మేయర్గా ఆలె మహ్మద్ గెలుపొందారు. తమ పదవుల్లో కొనసాగుతున్నారు. ప్రతి ఆర్థిక సంవత్సరం ఆరంభంలో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కోసం కొత్తగా మేయర్, డిప్యూటీ మేయర్ను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఎంసీడీ యాక్ట్ ప్రకారం.. ఇది తప్పనిసరి.
ఇప్పుడు కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా మేయర్, డిప్యూటీ మేయర్ను ఎన్నుకోవడానికి కౌన్సిలర్లు సమావేశం అయ్యారు. ఈ సారి ఎవరు గెలుస్తారనేది ఉత్కంఠతగా మారిన నేపథ్యంలో అనూహ్యంగా శిఖా రాయ్ తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నారు. దీనితో మేయర్గా షెల్లీ ఓబెరాయ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్ రేసులో నిలిచిన సోనీ పాండే కూడా వైదొలిగారు. ఈ స్థానానికి ఇక్బాల్ ఎన్నిక కూడా ఏకగ్రీవమైంది.












Click it and Unblock the Notifications