ఆప్ నుంచి రాజ్యసభకు బిజినెస్మెన్: కేజ్రీ తీరుపై విమర్శల జోరు!!
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ నుంచి రాజ్యసభ ఎన్నికల విషయమై అధికార ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్)లో మరో అంతర్గత సంఘర్షణను రేకెత్తించింది. సుశీల్ గుప్తా అనే వ్యాపార వేత్తను ఎంపిక చేయడంపై ఆప్ మాజీ సభ్యుడు మయాంక్ గాంధీ వంటి వారు పార్టీ నాయకత్వంపై ట్విట్టర్లో విమర్శలు గుప్పిస్తున్నారు. ఎంపీ సీటు డబ్బు పెట్టి కొనుక్కున్నారని మయాంక్ గాంధీ ఆరోపించారు.కానీ సుశీల్ గుప్తా నివాసం ఉంటున్న పంజాబీ బాగ్ ప్రాంత వాసులు మాత్రం ఆయన మంచి తనానికి వంద మార్కులేసేశారు.
ఢిల్లీ అసెంబ్లీ నుంచి ముగ్గురు అభ్యర్థులను పంపేందుకు ఆమ్ ఆద్మీ పార్టీకి పూర్తి స్థాయి బలం ఉన్నది. ఆ మేరకు కసరత్తు చేసిన తర్వాత అభ్యర్థుల పేర్లు ఖరారు చేసింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తొలి అభ్యర్థిగా ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు సంజయ్ సింగ్, రెండో పేరు ఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న చార్టర్డ్ అక్కౌంటెంట్ ఎన్డీ గుప్తా పేరు ప్రకటించారు. వీరి పేర్ల అభ్యర్థిత్వంపై ఆప్ నాయకత్వంలో గానీ, శ్రేణుల్లో గానీ ఎవరికీ అభ్యంతరాలు లేవు.
సంజయ్ సింగ్, అరవింద్ కేజ్రీవాల్కు అత్యంత విధేయుడు. ఇక ఎన్డీ గుప్తా పన్నుల చెల్లింపు విషయమై ఆప్ నాయకత్వానికి ఉచితంగా సేవలందిస్తున్న చార్టర్డ్ అక్కౌంటెంట్. మూడో అభ్యర్థిగా మాజీ కాంగ్రెస్ పార్టీ నేత, వ్యాపార వేత్త సుశీల్ గుప్తా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంతోనే అందరి నొసళ్లు ముడివడ్డాయి. సుశీల్ గుప్తాను రాజ్యసభకు నామినేట్ చేసినందుకు ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మధ్య తరగతి ప్రజలను ఆకట్టుకున్న కేజ్రీవాల్
సుశీల్ గుప్తా అభ్యర్థిత్వం ఎంపికపై ఆప్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన యోగేంద్ర యాదవ్ స్పందిస్తూ, తాను అరవింద్ కేజ్రీవాల్తో కలిసి పని చేయడం సిగ్గు చేటుగా ఉన్నదని వ్యాఖ్యానించారు. ఆప్ మరో వ్యవస్థాపక నేత, రాజస్థాన్ శాఖ అధ్యక్షుడు కుమార్ విశ్వాస్ స్పందిస్తూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఒక నియంత అని అభివర్ణించారు. రాజ్యసభకు సుశీల్ గుప్తా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయాన్ని కొందరు వివాదాస్పదం చేయొచ్చు గానీ, కానీ కేజ్రీవాల్ మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి ప్రజల మద్దతు కూడగట్టుకున్న మాట కూడా అంతే నిజం. ఢిల్లీకి పొరుగున ఉన్న హర్యానా సీఎం కేజ్రీవాల్ సొంత రాష్ట్రం. హర్యానాలో ఆప్ తరఫున సుశీల్ గుప్తా పని చేసినా పెద్ద ప్రయోజనం కలగలేదు.
ఇతర రాజకీయ నేతలతో కలుపొద్దన్న సుశీల్
2013 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్పై మోతీనగర్ స్థానం నుంచి పోటీ చేసిన సుశీల్ గుప్తా ఓటమి పాలయ్యారు. ఎన్ఎస్యూ (ఐ)లో విద్యార్థి కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించిన సుశీల్ గుప్తా తన పిల్లలు పెద్దాళ్లైపోయి పెండ్లిళ్లు చేసుకున్నందున సమాజం కోసం ఏదో చేయాలన్న సంకల్పం తనలో ఉన్నదన్నారు. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని వదిలేసి ఆమ్ఆద్మీ పార్టీలో చేరారు. అప్పుడే ఎన్నికల్లో పోటీ చేయాలని ఆఫర్ వచ్చినా ముందు పార్టీ విధి విధానాలు నచ్చాలని కోరుకున్నట్లు తెలిపారు. అందుకే 2015 అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉన్నట్లు చెప్పారు. తనను రాజకీయ పార్టీల నేతలతో కలిపేయొద్దని సుశీల్ గుప్తా అన్నారు. తానెప్పుడు కాంగ్రెస్ పార్టీని వీడానో అందరికీ తెలిసిన విషయమేనన్నారు.
నిజాలు మాట్లాడినందుకే శిక్షించారన్న విశ్వాస్
రాజ్యసభ సభ్యత్వంపై కుమార్ విశ్వాస్ పెట్టుకున్న ఆశలు అడియాసలు అయ్యాయి. ‘ఆప్'లో అంతర్గత పొరపాట్లు మరోసారి వెలుగు చూశాయి. నిజానిజాలు బయట పెట్టిన వారిని అరవింద్ కేజ్రీవాల్ శిక్షిస్తారని కుమార్ విశ్వాస్ ఆరోపించారు. కుమార్ విశ్వాస్ మాత్రమే కాదు మాజీ జర్నలిస్టు, ఆప్ సీనియర్ నేత అశుతోష్ అభ్యర్థిత్వం కూడా పరిశీలనకు నోచుకోలేదు. 2014 లోక్సభ ఎన్నికల వరకు అరవింద్ కేజ్రీవాల్కు అత్యంత సన్నిహితుడు. ఆప్ వర్గాలు కూడా రాజ్యసభ సభ్యత్వానికి కుమార్ విశ్వాస్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తారని అంచనా వేశారు. ఏడాది కాలంగా వారిద్దరి మధ్య గల స్నేహం చెడింది. ఎంపీ కావాలని కుమార్ విశ్వాస్ అభిలషిస్తున్నారని సంగతి కేజ్రీవాల్కు సమాచారం అందింది. అప్పటి నుంచి విశ్వాస్ను కేజ్రీవాల్ అనుమానాస్పదంగా చూస్తున్నారు.
కపిల్ మిశ్రాపై స్పందించని కుమార్ విశ్వాస్
సర్జికల్స్ స్ట్రయిక్స్ జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి విశ్వాస్ మద్దతు పలికారు. నోట్ల రద్దుపై తన వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడించినందుకు కుమార్ విశ్వాస్ తన అభిప్రాయం వెల్లడించడంతో ఆప్లో ఆయనకు దూరాన్ని పెంచేశాయి. గతేడాది మార్చిలో పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో విశ్వాస్ భాగస్వామ్యం కల్పించక పోవడంతో పార్టీ నేతల్లో విభేదాలు పొడచూపాయి. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేయాలని ఒక్కనాడు కూడా ఆప్ నాయకత్వం ఆయనను ఆహ్వానించలేదు. పార్టీపై తిరుగుబాటు చేసిన ఢిల్లీ మంత్రి కపిల్ మిశ్రాకు వ్యతిరేకంగా ఎటువంటి వైఖరి తీసుకోక ఆప్ నేతల్లో విశ్వాస్ ఏకాకిగా మారారు. గమ్మత్తేమిటంటే నాడు భారత్ అవినీతి వ్యతిరేక క్యాంపెయిన్ (ఐఏసీ) మూవ్మెంట్లో కేజ్రీవాల్తోపాటు కీలకంగా కుమార్ విశ్వాస్ వ్యవహరించారు. తాను కేజ్రీవాల్కు స్నేహితుడినని అలాగే చూశానని, అధినేతగా చూడలేదని కుమార్ విశ్వాస్ పేర్కొన్నారు. అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంపై విమర్శలు గుప్పించిన కుమార్ విశ్వాస్ ఇప్పటికీ ‘ఆప్' రాజస్థాన్ వ్యవహారాల ఇన్చార్జీగా వ్యవహరిస్తున్నారు. కానీ పార్టీ శ్రేణులతో మాత్రం కలువడం లేదు.