వీడియో: నక్సల్స్ అపహరించిన కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ విడుదల, ఆనందంలో కుటుంబం
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ అడవుల్లో ఇటీవల చోటు చేసుకున్న భీకర ఎదురుకాల్పుల తర్వాత మావోయిస్టుల చెరలో చిక్కుకున్న కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ మన్హాస్కు గురువారం విముక్తి లభించింది. ఐదు రోజుల తర్వాత నక్సల్స్ ఆ జవానును విడుదల చేశారు. ఈ క్రమంలో రాకేశ్వర్ సింగ్ సీఆర్పీఎఫ్ శిబిరానికి క్షేమంగా చేరుకున్నారు.
The Maoist release Constable Rakeshwar Singh Manhas. Making it a spectacle. The release of soldier Infront of villagers and stronghold of Maoist. https://t.co/wtRDEqcBhC pic.twitter.com/unEHwIeWLh
— kamaljit sandhu (@kamaljitsandhu) April 8, 2021
బీజాపూర్-సుకుమా జిల్లాల సరిహద్దులో ఏప్రిల్ 3న జరిగిన ఎన్కౌంటర్లో28 మంది జవాన్లు మృతి చెందారు. పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు. అయితే, రాకేశ్వర్ సింగ్ను మావోయిస్టులు అపహరించుకుపోయారు. జవాను తమ వద్ద బందీగా ఉన్నట్లు ఏప్రిల్ 5న మావోయిస్టులు లేఖ విడుదల చేసిన విషయం తెలిసిందే. బుధవారం రాకేశ్వర్ ఫొటోను మీడియాకు పంపించారు.
ఓ పూరి గుడిసెలో జవాను క్షేమంగా ఉన్నట్లు ఆ ఫొటోలో కనిపించింది. ఈ క్రమంలో తమ తండ్రిని విడిచిపెట్టాలంటూ జవాను కుమార్తె చేసిన విజ్ఞప్తి మీడియా ద్వారా స్వీకరించామని మావోయిస్టులు బుధవారం ప్రకటించారు. అంతేగాక, మధ్యవర్తులను పంపిస్తే అతడ్ని విడుదల చేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు సదరు జవానును గురువారం విడిచిపెట్టారు.
Another video of release.
— kamaljit sandhu (@kamaljitsandhu) April 8, 2021
A sigh of relief for family, crpf and nation pic.twitter.com/4Pr4wRv68J
కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ సురక్షితంగా విడుదల కావడంతో ఆయన కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. సింగ్ ఇంట్లో పండగ వాతావరణం కనిపించింది. రాకేశ్వర్ సింగ్ విడుదల సమాచారాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న ఆయన కుటుంబసభ్యులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వారు ధన్యవాదాలు తెలిపారు. కాగా, రాకేశ్వర్ సింగ్ స్వస్థలం జమ్మూ. ఆయన 210వ కోబ్రా దళంలో విధులు నిర్వహిస్తున్నారు.