ఏబీపీ-సీ ఓటరు ఒపీనియన్ పోల్: యూపీలో బీజేపీకీ పరాభవం, ఐదు రాష్ట్రాల్లో హవా
న్యూఢిల్లీ: ఇప్పటికి ఇప్పుడు లోకసభకు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని ఏబీపీ - సీ ఓవోటరు 'దేశ్ కా మూడ్' పేరుతో సర్వే చేసింది. ఒపీనియన్ పోల్కు సంబంధించిన ఫలితాలు గురువారం సాయంత్రం ఆరు గంటలకు విడుదలయ్యాయి.
ఈ సర్వే ప్రకారం యూపీలో బీజేపీకీ పెద్ద ఎత్తున నష్టం జరగనుంది. ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ కలిస్తే ఆ నష్టం మరింత ఎక్కువ ఉండనుంది. బీఎస్పీ ఒంటరిగా పోటీ చేస్తే బీజేపీ పెద్ద ఎత్తున లబ్ధి పొందనుంది.
ఉత్తర ప్రదేశ్లో ఒపీనియన్ పోల్
ఉత్తర ప్రదేశ్లో మొత్తం 80 స్థానాలు ఉన్నాయి. ఇందులో ఎన్డీయేకు 36 సీట్లు, యూపీఏకీ రెండు సీట్లు, మాయావతి - అఖిలేష్ యాదవ్ పార్టీలైన బీఎస్పీ, ఎస్పీలకు 42 సీట్లు వస్తాయని తేలింది. ఒకవేళ కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్పీలు కలిస్తే ఈ కూటమికి 56 సీట్లు, ఎన్డీయేకు 24 స్థానాలు వస్తాయని తేలింది. యూపీలో బీఎస్పీ ఒంటరిగా పోటీ చేస్తే ఎన్డీయేకు 70, యూపీఏకూ 2, ఇతరులకు 8 సీట్లు రానున్నాయి.
బీహార్లో ఒపీనియన్ పోల్
బీహార్లో నలభై లోకసభ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ ఎన్డీయే 22 సీట్లు, యూపీఏ 18 సీట్లు సీట్లు గెలుస్తాయని ఒపీనియన్ పోల్లో వెల్లడైంది. బీహార్లో రెండు రకాలుగా ఒపీనియన్ పోల్ నిర్వహించారు. మహాగట్బంధన్ ఏర్పడితే యూపీఏకీ 18, ఎన్డీయేకు 22 సీట్లు, లేదంటే ఎన్డీయేకు 31 సీట్లు, యూపీఏకీ 9 సీట్లు వస్తాయని సర్వేలో వెల్లడైంది.
మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్, రాజస్థాన్లలో ఒపీనియన్ పోల్
మధ్యప్రదేశ్లో ఎన్డీయేకు 23, యూపీఏకు 6 సీట్లు వస్తాయని ఒపీనియన్ పోల్లో తేలింది. ఏబీపీ ఒబీనియన్ ప్రకారం చత్తీస్గఢ్లో ఎన్డీయే 9, యూపీఏ 2 స్థానాలు గెలుచుకోనుంది. చత్తీస్గఢ్లో 11 లోకసభ స్థానాలు ఉన్నాయి. రాజస్థాన్లో 25 లోకసభ స్థానాలు ఉండగా, ఎన్డీయేకు 18, యూపీఏకీ 7 స్థానాలు వస్తాయని ఒపీనియన్ పోల్లో వెల్లడైంది.
ఐదు రాష్ట్రాల్లోని 185 సీట్లలో 117 సీట్లు ఎన్డీయేకు
ఉత్తర ప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్గఢ్లలో కలిపి 185 లోకసభ స్థానాలలో ఎన్డీయేకు 117 సీట్లు, యూపీఏకు 26 సీట్లు, ఇతరులకు 42 సీట్లు వస్తాయని సర్వేలో వెల్లడైంది.