ఎన్ కౌంటర్ కేసు: బీజేపీ చీఫ్ అమిత్ షాకు ఊరట
న్యూఢిల్లీ: సొహ్రాబుద్దీన్ షేక్ నకిలీ ఎన్ కౌంటర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు ఊరట లభించింది. అమిత్ షాకు వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్ ను సోమవారం సుప్రీం కోర్టు తోసిపుచ్చింది.
సొహ్రాబుద్దీన్ షేక్ ఎన్ కౌంటర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న అమిత్ షాకు బాంబే హైకోర్టు విముక్తి కల్పిస్తూ గతంలో తీర్పు చెప్పింది. బాంబే హై కోర్టు తీర్పును సవాలు చేస్తూ సామాజిక కార్యకర్త, ప్రభుత్వ మాజీ అధికారి హెచ్. మాందర్ సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.
సోమవారం సుప్రీం కోర్టు ద్విసభ్య బెంచ్ కేసు వివరాలు తెలుసుకుని పిటీషన్ ను తిరస్కరించింది. సామాజిక కార్యకర్త మాందర్ సొంత ప్రయోజనాల కోసం పిటీషన్ దాఖలు చేసినట్లు ఉందని బెంచ్ అభిప్రాయం వ్యక్తం చేసింది.

2005లో గ్యాంగ్ స్టర్ సొహ్రాబుద్దీన్ షేక్ ఎన్ కౌంటర్ అయ్యాడు. ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షిగా భావిస్తున్న తులసీరామ్ ప్రజాపతి హత్యకు గురైనాడు. గ్యాంగ్ స్టర్ సొహ్రాబుద్దీన్ షేక్ కేసులో అప్పటి గుజరాత్ హోం శాఖ మంత్రి అమిత్ షా నిందితుడు అని సీబీఐ కేసు నమోదు చేసింది.
అయితే ఈ కేసులో అమిత్ షాను నిందితుడిగా పేర్కోనడానికి ముంబై సీబీఐ కోర్టు నిరాకరించింది. సొహ్రాబుద్దీన్ కుటుంబ సభ్యులు సీబీఐ కోర్టు తీర్పును సవాలు చేస్తూ బాంబే హై కోర్టును ఆశ్రయించారు. సీబీఐ కోర్టు తీర్పును బాంబే హై కోర్టు సమర్థించింది.
ఇప్పుడు సీబీఐ ప్రత్యేక కోర్టు, బాంబే హై కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్థించింది. సుప్రీం కోర్టు తీర్పుతో అమిత్ షా ఊపిరి పీల్చుకున్నారు. అమిత్ షాకు న్యాయం జరిగిందని పలువురు బీజేపీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications