మంటగలిసిన మానవత్వం: ఆసుపత్రికి తరలిస్తే ఆమె బతికేది
చంఢీఘడ్: రోడ్డు ప్రమాదానికి గురైన ఓ యువతి రక్షించాలని ఎంతగా ప్రాధేయపడినా పట్టించుకోలేదు. ప్రాణాపాయస్థితిలో ఉన్న ఆమెను ఆసుపత్రికి తరలించకుండా.... ఆ స్థితిలో ఉన్న బాధితురాలి ఫోటోలు , వీడియో తీశారు. అయితే 45 నిమిషాలు ఆలస్యంగా ఆసుపత్రికి తరలించడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. మనిషిలో మానవత్వాన్ని కోల్పోతున్నాడని ఈ ఘటన మరోసారి నిరూపించింది.
పంజాబ్ రాష్ట్రంలోని చంఢీఘడ్ ఎయిర్పోర్ట్కు మార్గంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అమన్దీప్ కౌర్ (25) అనే యువతి మరణించింది. ఇటీవలనే అమన్సింగ్తో అమన్దీప్కు నిశ్చితార్థం అయింది.

ఈ ఏడాది నవంబర్ 13న, వివాహం జరగాల్సి ఉంది. ప్రస్తుతం జిరాక్పురాలో పెయింగ్గెస్ట్గా ఆమె నివసిస్తోంది. అమన్దీప్ కౌర్ తన స్నేహితురాలితో కలిసి ఆఫీసుకు వెళ్తోంది. అయితే వేగంగా వచ్చిన టిప్పర్ లారీ బలంగా ఢీకొట్టింది.
అమన్దీప్ కౌర్ దేహంలోని సగభాగం దెబ్బతింది. స్నేహితురాలికి కూడ తీవ్ర గాయాలయ్యాయి. అయితే రక్తం కారుతున్న అమన్దీప్ కౌర్ తనను రక్షించాలని కోరింది. కానీ, ఆమెను రక్షించేందుకు వచ్చేందుకు ఎవరూ కూడ ముందుకు రాలేదు. తీవ్ర గాయాలతో ఉన్న అమన్దీప్ కౌర్ను ఫోటోలు, వీడియోలు తీశారు. అయితే అమన్ దీప్ కౌర్ బంధువు వచ్చి ఆమెను ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యలోనే ఆమె చనిపోయింది.












Click it and Unblock the Notifications