కమలేష్ తివారీ హత్య కేసు: గాయాలు చూస్తే ఉగ్రవాదులపైనే అనుమానం
లక్నో: హిందూసమాజ్ పార్టీ అధ్యక్షుడు కమలేష్ తివారీ హత్యకేసులో హంతకులను గుర్తించడం జరిగింది. లక్నోలోని తన నివాసంలో శుక్రవారం రోజున కమలేష్ హత్యకు గురైన సంగతి తెలిసిందే. హంతకులను గుర్తించినప్పటికీ వారిని అరెస్టు చేయకపోవడంపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. సీసీ టీవీ ఫుటేజీలో ఇద్దరు ఆగంతకులు కమలేష్ నివాసంలోకి వెళుతున్నట్లుగా కనిపించింది . వారే ఈ హత్య చేసి ఉంటారనే అనుమానంను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. అయితే నిందితులు ఈ ఇద్దరే అయి ఉంటారని పోలీసులు అధికారికంగా ధృవీకరించలేదు.
డిమాండ్లు నెరవేర్చకుంటే ఆత్మాహుతికి పాల్పడతా
హిందూ సమాజ్ పార్టీ అధ్యక్షుడు కమలేష్ హత్య తర్వాత పోలీసులు అతని మృతదేహాన్ని పోస్టు మార్టంకు పంపారు. అనంతరం భౌతికకాయాన్ని అతని సొంత గ్రామం అయిన సీతాపూర్ జిల్లాలోని మహమూదాబాద్కు తరలించారు. ఆయన కుటుంబ సభ్యులకు భౌతికకాయాన్ని అప్పగించారు. అయితే ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ తమ కుటుంబాన్ని పరామర్శించి వారి డిమాండ్లను నెరవేర్చేవరకు తాము అంత్యక్రియలు నిర్వహించబోమని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కుటుంబంలో ఇద్దరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్లు నెరవేర్చకపోతే తాను ఆత్మాహుతికి పాల్పడతానని మృతురాలి భార్య చెబుతోంది. అంతకుముందు కమలేష్ కుటుంబాన్ని డిప్యూటీ సీఎం శర్మ పరామర్శించారు.
ఉగ్రవాదులే కమలేష్ను హత్యచేశారా..?
ఇదిలా ఉంటే పోస్టుమార్టం నివేదికలో పలు అంశాలు వెలుగు చూశాయి. కమలేష్ను అత్యంత దారుణంగా పొడిచి చంపారని వైద్యులు నివేదికలో పేర్కొన్నారు. మొత్తం 13 కత్తి పోట్లు ఆయన శరీరంలోకి దిగాయని చెప్పారు. ఇక ఆయన మెడపై ఉన్న గాయాలు చూస్తే అది సాధారణ పోట్లులా లేవని వైద్యులు చెప్పారు. ఈ తరహా పద్ధతిలో హత్యలను ఉగ్రవాదులు మాత్రమే చేస్తారని వైద్యులు చెప్పారు. కమలేష్ దవడపై తుపాకీతో కాలిస్తే నోట్లో నుంచి బయటకు వచ్చిందని వైద్యులు పోస్టుమార్టం నివేదికలో పొందుపర్చారు.
హత్యకు ముందు ఏం జరిగింది
కమలేష్ హత్యతో ఒక్కసారిగా లక్నో అట్టుడికింది. ఆయన అభిమానులు కార్యకర్తలు నిరసనలకు దిగారు. కమలేష్ తివారి ఇంటి బయట నినాదాలు చేశారు. దీంతో ఆ ప్రాంతంలోని దుకాణాలను బంద్ చేశారు. ఆగ్రహంతో ఊగిపోయిన ఆందోళనకారులు మార్చురీ బయట బీభత్సం సృష్టించారు. ఓ బస్సును కూడా ధ్వంసం చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హంతకులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కమలేష్ హత్యకు ముందు కాషాయ వస్త్రాలు ధరించిన ఇద్దరు వ్యక్తులు ఆయన నివాసం వద్దకు స్వీట్ బాక్సులతో చేరుకుని దాదాపు 30 నిమిషాల పాటు ఆయనతో గడిపినట్లు పోలీసులు చెప్పారు. స్వీట్ బాక్సుల్లోనే ఆయుధాలు తీసుకువచ్చినట్లు వారు చెప్పారు. అతనితో 30 నిమిషాల పాటు గడిపారంటే కమలేష్కు వారు తెలిసినవారై ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.