'శశికళ తొందరపాటు: సంతాప దినాలు కూడా పూర్తికాకముందే అలా!..'
ప్రభుత్వం ప్రకటించిన సంతాప దినాలు కూడా పూర్తి కాకముందే శశికళ నాయకత్వానికి సంబంధించిన డిమాండ్స్ తెరపైకి రావడం బాధాకరమని ఆనంద్ రాజ్ అన్నారు.
చెన్నై: తమిళ దివంగత సీఎం జయలలిత మృతి తర్వాత అన్నాడీఎంకె రాజకీయాల పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా పార్టీ పగ్గాలను చిన్నమ్మ శశికళకు అప్పగించే విషయంలో నెలకొన్న మీమాంసం పట్ల తీవ్ర చర్చ జరిగింది.
శశికళకు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి అప్పగించడం పట్ల తమిళ ప్రజల నుంచి, అన్నాడీఎంకె లోని కింది స్థాయి కార్యకర్తల నుంచి భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే సీఎం పన్నీర్ సెల్వం సహా ఎమ్మెల్యేలంతా శశికళకు పగ్గాలు అప్పగించడానికే మొగ్గు చూపుతుండటంతో శశికళ పార్టీ పగ్గాలు చేపట్టడం ఇక లాంఛనమే అన్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో అన్నాడీఎంకె కార్యకర్త, ప్రముఖ సినీ విలన్ ఆనంద్ రాజ్ పార్టీ రాజకీయాల పట్ల స్పందించారు. ఓ తమిళ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్బంగా జయలలిత మరణం, అన్నాడీఎంకె రాజకీయాల పట్ల స్పందించిన ఆనంద్ రాజ్, పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

శశికళ తొందరపాటును ప్రదర్శిస్తున్నారు:
అన్నాడీఎంకె కార్యదర్శి పదవి కోసం శశికళ తొందరపాటు ధోరణితో వ్యవహరించారని ఆనంద్ రాజ్ అభిప్రాయపడ్డారు. సామాన్యులందరు ప్రస్తుతం ఇదే విషయంపై చర్చించుకుంటున్నారని చెప్పారు.
ప్రభుత్వం ప్రకటించిన సంతాప దినాలు కూడా పూర్తి కాకముందే శశికళ నాయకత్వానికి సంబంధించిన డిమాండ్స్ తెరపైకి రావడం బాధాకరమని అన్నారు. శశికళ ఎందుకింతగా తొందరపడుతున్నారో అర్థంకావడం లేదని పేర్కొన్నారు.

అది పూర్తిగా పార్టీ అంతర్గత విషయం:
జయలలిత మరణానికే ముందే అన్నాడీఎంకె శాసన సభ్యుల సమావేశం జరగడమన్నది పూర్తిగా పార్టీ అంతర్గత వ్యవహారమని, ఈ విషయంలో కామెంట్ చేయడానికి ఏమి లేదని ఆనందర్ రాజ్ తెలిపారు.

ఎవరున్నా ఓకె..! ఆ వార్తల్లో నిజం లేదు..
పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని ఎవరు స్వీకరించినా.. పార్టీ కార్యకర్తగా తన బాధ్యతలు తాను నెరవేర్చడానికి ముందుంటానని ఆనంద్ రాజ్ తెలిపారు. అన్నాడీఎంకె నుంచి తాను తప్పుకున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు.

ఆ విషయం తెలియదు..
జయలలితను చూసేందుకు వచ్చిన ఆమె మేనకోడలు దీపను అనుమతించలేదన్న విషయం తనకు తెలియదని, అలాగే జయలలిత వీలునామా రాశారా? లేదా? అన్నది కూడా తనకు తెలియదని ఆనంద్ రాజ్ పేర్కొన్నారు. జయలలిత నివాసమైన పొయెస్ గార్డెన్ ను అమ్మ స్మారకంగా మాత్రమే గాక ఆమె విగ్రహాన్ని ప్రతిష్టించి అక్కడ మూడు పూటలు పూజ కార్యక్రమాలు నిర్వహించాలని ఆనంద్ రాజ్ తన మనసులో మాట చెప్పారు.












Click it and Unblock the Notifications