కమల్ హాసన్ మీద కోర్టులో కేసు, దినకరన్ ఎఫెక్ట్, ఓటుకు రూ. 20 వేలు, భయం లేదు!
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించిన చెన్నైలోని ఆర్ కే నగర్ లో జరిగిన ఉప ఎన్నికల్లో టీటీవీ దినకరన్ గెలుపుపై బహుబాష నటుడు కమల్హాసన్ చేసిన విమర్శలు ఆయనను వివాదాల్లోకి నెట్టాయి. టీటీవీ దినకరన్ అభిమానులు ఆగ్రహంతో కమల్ హాసన్ దిష్టిబొమ్మలు దహనం చేస్తున్నారు. టీటీవీ దినకరన్ అభిమాని కోర్టులో పిటిషన్ వేయడంతో వివాదం మరింత ముదిరింది. టీటీవీ దినకరన్ అనుచరులు దాఖలు చేసిన నిటిషన్ ను చట్టపరంగా ఎదుర్కొవడానికి తాను సిద్దంగా ఉన్నానని కమల్ హాసన్ స్పష్టం చేశారు.
టీటీవీ దినకరన్
గత ఏడాది డిసెంబర్ 21వ తేదీ ఆర్ కే నగర్ ఉప ఎన్నిక జరిగింది. అన్నాడీఎంకే, డీఎంకే, బీజేపీ పార్టీలకు చుక్కలు చూపించిన టీటీవీ దినకరన్ ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో 40 వేల మేజారిటీతో విజయం సాధించి తమిళనాడులో చర్చకు దారి తీశారు.
హీరో కమల్ కామెంట్
ఆర్ కే నగర్ లో పోటీ చేసిన అన్నాడీఎంకే పార్టీ అభ్యర్థి మధుసూదనన్ మినహా డీఎంకే, బీజేపీతో సహ అందరూ డిపాజిట్ కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఇటీవల కమల్ హాసన్ మీడియాతో మాట్లాడుతూ టీటీవీ దినకరన్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
ఓటుకు రూ. 20 వేలు
ఆర్ కే నగర్ ఉప ఎన్నికల సందర్బంగా టీటీవీ దినకరన్ ఓటుకు రూ. 20 వేలు పంచిపెట్టారని హీరో కమల్ హాసన్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కమల్ హాసన్ విమర్శలు టీటీవీ దినకరన్ తో పాటు ఆయన అనుచరులకు ఆగ్రహాం తెప్పించింది.
దొంగ దగ్గర బిక్షం ఎత్తుకున్నారు !
టీటీవీ దినకరన్ లాంటి దొంగ దగ్గర ఆర్ కే నగర్ ఓటర్లు ఓటుకు రూ. 20 వేలు తీసుకుని బిక్షం ఎత్తుకున్నారని కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కమల్ హాసన్ వ్యాఖ్యలను టీటీవీ దినకరన్ తో పాటు ఆయన అనుచరులు తీవ్రస్థాయిలో ఖండించారు.
కోర్టులో పిటిషన్
ఆర్ కే నగర్ ఓటర్లను అవమానించే విధంగా హీరో కమల్ హాసన్ తీవ్రస్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేశారని ఆరోపిస్తూ కోయంబత్తూరుకు చెందిన టీటీవీ దినకరన్ అనుచరుడు ఇళంగోవన్ కోయంబత్తూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
పిటిషన్ ఓకే
టీటీవీ దినకరన్ అనుచరుడు ఇళంగోవన్ దాఖలు చేసిన పిటిషన్ ను కోయంబత్తూరు కోర్టు విచారణకు స్వీకరించింది. ఈనెల 12వ తేదీ పిటిషన్ విచారణ చేస్తామని కోయంబత్తూరు కోర్టు చెప్పింది. కమల్ హాసన్ మీద కోర్టులో మరో కేసు దాఖలు కావడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
భయం లేదు
టీటీవీ దినకరన్ అనచరులు కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై హీరో కమల్ హాసన్ స్పంధించారు. టీటీవీ దినకరన్ ఏం చేశాడో అదే చెప్పానని, కోర్టులో చట్టపరంగా కేసు విచారణ ఎదుర్కొవడానికి సిద్దంగా ఉన్నానని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కమల్ హాసన్ చెప్పారు.