'ప్రజలు అదే కోరుకుంటున్నారు.. అమ్మ తర్వాత పన్నీరే సమర్థుడు!'
ప్రజలు సైతం అన్నాడీఎంకెలో పన్నీర్ సెల్వం నాయకత్వాన్నే కోరుకుంటున్నారని అలనాటి నటి లత అభిప్రాయపడ్డారు.
చెన్నై: తమిళ దివంగత సీఎం జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకె పార్టీ శశికళ-పన్నీర్ సెల్వం మధ్య నిలువునా చీలిపోయే పరిస్థితి తలెత్తిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఎమ్మెల్యేలంతా శశికళ శిబిరం వైపే ఉన్నా.. ప్రజా శిబిరంలో మాత్రం పన్నీర్ సెల్వం కావాల్సినంత మద్దతును, సానుభూతిని కూడగట్టుకున్నారు.
పలువురు సినీ ప్రముఖులు సైతం పన్నీర్ సెల్వంకే బహిరంగ మద్దతు తెలుపుతూ వచ్చారు. తాజాగా ఆ జాబితాలో అలనాటి నటి లత కూడా చేరారు. జయలలిత తర్వాత అన్నాడీఎంకె పగ్గాలు చేపట్టే సమర్థత ఆమె వారసుడిగా పన్నీర్ కే ఉందని ఆమె వ్యాఖ్యానించారు. పన్నీర్ సెల్వం శిబిరానికి తాను మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.
పన్నీర్ ను కలిసిన సందర్బంగా లత ఆయన్ను శాలువాతో సత్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమ్మ జయలలిత చూపించిన మార్గంలో ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగించిన నేతగా పన్నీర్ ను అభినందించారు.
ప్రజలు సైతం అన్నాడీఎంకెలో పన్నీర్ సెల్వం నాయకత్వాన్నే కోరుకుంటున్నారని లత అభిప్రాయపడ్డారు. ఇక తన సినీ ప్రయాణం గురించి చెబుతూ.. తనను తీర్చిదిద్దిన వ్యక్తి ఎంజీఆర్ అని, ఇప్పటికీ తాను సినిమాల్లో కొనసాగుతున్నానంటే కారణం ఆయనేనని పేర్కొన్నారు.
ఎంజీఆర్ స్థాపించిన ఈ పార్టీని నడింపించేందుకు జయలలిత తర్వాత పన్నీర్ మాత్రమే అర్హులని లత అన్నారు. పన్నీర్ నాయకత్వంలో తామంతా ముందుకు నడుస్తామని తెలిపారు. కాగా, ఆదివారం నాడు పన్నీర్ సెల్వం నివాసంలో లత ఆయన్ను కలిశారు.