వివేక్ మృతికి కరోనా వ్యాక్సిన్కు లింక్: నటుడు మన్సూర్ అలీ ఖాన్పై కేసు నమోదు
చెన్నై: ప్రముఖ తమిళ సినీ నటుడు మన్సూర్ అలీఖాన్పై చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. కరోనా వ్యాక్సినేషన్పై తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారని ఆయనపై అభియోగాలు నమోదు చేశారు. ఇటీవల ప్రముఖ తమిళ సినీ నటుడు వివేక్ అనారోగ్యంతో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే.
అయితే, వివేక్ మృతికి.. కరోనా వ్యాక్సిన్కు ముడిపెడుతూ మన్సూర్ అలీ ఖాన్ తమిళనాడు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కరోనా వ్యాక్సిన్ కారణంగానే వివేక్ మరణించారంటూ సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టారు.
ఈ నేపథ్యంలో గ్రేటర్ చెన్నై కార్పొరేషన్.. మన్సూర్ అలీ ఖాన్ పై వడపళని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అతడు చేసిన నిరాధారమైన ఆరోపణలు ప్రభుత్వ వ్యాక్సినేషన్ ప్రక్రియపై ప్రభావం చూపించే విధంగా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు పలు సెక్షన్ల కింద మన్సూర్ అలీ ఖాన్పై కేసు నమోదు చేశారు.
కాగా, మన్సూర్ అలీ ఖాన్ ముందస్తు బెయిల్ కోసం ప్రిన్సిపల్ సెషన్ కోర్టును ఆశ్రయించారు. కరోనా వ్యాక్సిన్కు, వివేక్ మరణానికి ఎలాంటి సంబంధం లేదని తమిళనాడు రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాధాకృష్ణన్ ఇప్పటికే స్పష్టం చేశారు. అలీ ఖాన్ చేసిన తప్పుడు వ్యాఖ్యలు కరోనా వ్యాక్సిన్ ప్రక్రియపై ప్రభావం చూపే అవకాశాలున్నాయన్నారు. ఆయన వ్యాఖ్యలను ఖండించారు.