మోడీని కలిసేందుకు నటి మైత్రియా హంగామా, తరలించిన మహిళా పోలీసులు
బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోడిని కలవాలని తన సమస్యలు ఆయనకు చెప్పాలని కన్నడ నటి మైత్రియా గౌడ నానా హంగామా చేశారు. శుక్రవారం రాత్రి బెంగళూరులోని నేషనల్ కాలేజ్ మైదానంలో నరేంద్ర మోడి బహిరంగ సభ జరిగిన విషయం తెలిసిందే.
నేషనల్ కాలేజ్ మైదానంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. నరేంద్ర మోడి నేషనల్ కాలేజ్ మైదానం చేరుకునే కొన్ని నిమిషాల ముందు మైత్రియా గౌడ అక్కడ ప్రత్యక్షం అయ్యింది. వీవీఐపి గేట్ దగ్గరకు వెళ్లి తాను మైదానం లోపలికి వెళ్లడానికి అవకాశం ఇవ్వాలని పోలీసు అధికారులకు చెప్పింది.

తనకు బీజేపీ నాయకుల వలన అనేక సమస్యలు వచ్చాయని, తన సమస్యలను ప్రధాని నరేంద్ర మోడికి దృష్టికి తీసుకు వెళ్లాలని పట్టుబట్టింది. వీవీఐపీ పాస్ లు ఉన్న వారు లోపలికి వెళ్లడానికి తాము అనుమతి ఇస్తామని, పాస్ లు లేకుంటే వెళ్లనివ్వమని అక్కడ విధులలో ఉన్న ఏసీపీ దావూద్ ఖాన్ స్పష్టం చేశారు.
ఆ సమయంలో మైత్రియా గౌడ పోలీసు అధికారులతో వాగ్వివాదానికి దిగింది. లోపలికి వెళ్లడానికి ప్రయత్నించింది. పరిస్థితి విషమించడంతో మహిళ పోలీసులు వచ్చి మైత్రియా గౌడను అదుపులోకి తీసుకున్నారు. నేషనల్ కాలేజ్ మైదానం బయటకు తీసుకు వెళ్లి వదిలి పెట్టారు. ఆమె ప్రధాని నరేంద్ర మోడిని కలవడానికి విఫలయత్నం చేశారు.












Click it and Unblock the Notifications