రియల్ ఎస్టేట్ గొడవ: బిల్డర్, లాయర్ ముఖం పచ్చడి చేసిన ప్రముఖ నటుడు, కేసు, ఎస్కేప్ !
బీజేపీ తమిళనాడు విభాగం నాయకుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి, బిల్డర్, లాయర్ మీద దాడి చేసిన కేసులో తమిళ నటుడు సంతానం మీద చెన్నైలోని ముతుల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
చెన్నై: బీజేపీ తమిళనాడు విభాగం నాయకుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి, బిల్డర్, లాయర్ మీద దాడి చేసిన కేసులో తమిళ నటుడు సంతానం మీద చెన్నైలోని ముతుల్ పోలీసులు కేసు నమోదు చేశారు. నటుడు సంతానంతో పాటు అతని మేనేజర్ రమేష్ మాయం అయ్యారని వారి కోసం గాలిస్తున్నామని మంగళవారం పోలీసులు చెప్పారు.
టీవీ చానల్ లో వ్యాఖ్యతగా తమిళ ప్రజలకు పరిచయం అయిన సంతానం తరువాత తమిళ సినిమాల్లో నటించాడు. ప్రముఖ హీరోల సినిమాల్లో కీలకపాత్రలు పోషించిన సంతానం తరువాత హీరో అయ్యాడు. ప్రస్తుతం అనేక సినిమాల్లో కీలకపాత్రలు పోషిస్తున్న సంతానం రెండు చేతులా సంపాధిస్తున్నాడు.
కమర్షియల్ కాంప్లెక్స్
సంతానం చెన్నైలోని కుంద్రతూర్ ప్రాంతంలో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్ణించడానికి సిద్దం అయ్యాడు. బీజేపీ తమిళనాడు రాష్ట్ర శాఖ నాయకుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి, బిల్డర్ అయిన షణ్ముగ సుందరంను సంతానం కలిశాడు. కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించి ఇవ్వాలని షణ్ముగ సుందరంకు చెప్పాడు.
అగ్రిమెంట్ చేసుకున్నారు
బిల్డర్ షణ్ముగ సుందరంకు అడ్వాన్స్ గా నగదు ఇచ్చిన సంతానం న్యాయవాది ప్రేమ్ ఆనంద్ సమక్షంలో ఇద్దరూ అగ్రిమెంట్ చేసుకున్నారు. బిల్డర్ షణ్ముగ సుందరం కమర్షియల్ కాంప్లెక్స్ పనులు మొదలు పెట్టారు. తరువాత ఏం జరిగిందో ఏమో తెలీదు కాని తాను ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇవ్వాలని నటుడు సంతానం ఒత్తిడి చేశారు.
ఆఫీస్ కు వెళ్లారు
పనులు మొదలు పెట్టిన తరువాత అడ్వాన్స్ తిరిగి ఎవ్వడం ఎలా అంటూ బిల్డర్ షణ్ముగ సుందరం వాపోయాడు. సోమవారం రాత్రి నటుడు సంతానం తన మేనేజర్ రమేష్ తో పాటు మరో వ్యక్తితో కలిసి బిల్డర్ షణ్ముగ సుందరం కార్యాలయం దగ్గరకు వెళ్లారు. అదే సమయంలో న్యాయవాది ప్రేమ్ ఆనంద్ అక్కడికి వెళ్లారు.
అడ్వాన్స్ ఇవ్వలేం
తాను ఇచ్చిన అడ్వాన్స్ మొత్తం తిరిగి ఇవ్వాలని సంతానం ఒత్తిడి చేశాడు. అడ్వాన్స్ తిరిగి ఇవ్వడం కుదరదని బిల్డర్ షణ్ముగ సుందరం తేల్చి చెప్పారు. ఇరు వర్గాల మధ్య మాటామాట పెరిగింది. సహనం కొల్పోయిన నటుడు సంతానం, అతని మేనేజర్ రమేష్, మరో వ్యక్తి కలిసి బిల్డర్ షణ్ముగ సుందరం, న్యాయవాది ప్రేమ్ ఆనంద్ మీద దాడి చేశారు.
ముఖం పచ్చడి అయ్యింది
ఈ దాడిలో బిల్డర్ షణ్ముగ సుందరం, న్యాయవాది ప్రేమ్ ఆనంద్ ముఖం పచ్చడి అయ్యింది. తీవ్రగాయాలు అయ్యి రక్తం పోవడంతో ఇద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడి కేసులో సంతానం మీద బాధితులు ఫిర్యాదు చేశారని పోలీసులు చెప్పారు. నటుడు సంతానంతో పాటు ఆయన మేనేజర్ రమేష్, మరో వ్యక్తి మాయం అయ్యారని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. నటుడు సంతానంను వెంటనే అరెస్టు చెయ్యాలని బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షురాలు తమిళసై సౌందరరాజన్ డిమాండ్ చేశారు.