కాంగ్రెస్లోకి త్రిష..? రాహుల్ జోడో యాత్రలో - కొత్త పాత్రలో..!!
చెన్నై: ప్రముఖ నటి త్రిష కృష్ణన్ రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతోన్నారా?.. దీనికి అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటోన్నారా?.. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సమాయాత్తమౌతోన్నారా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. భారత్ జోడో యాత్ర సందర్భంగా ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరొచ్చనే ప్రచారం తమిళనాడు రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత, లోక్సభ సభ్యుడు రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరుతారని చెబుతున్నారు.
రాజకీయాల్లోకి ప్రవేశించిన తమిళ నటీనటుల లిస్ట్ పెద్దదే. ఎంజీ రామచంద్రన్ మొదలుకుని ఖుష్బూ వరకు చాలామంది నటులు రాజకీయాల్లో అడుగు పెట్టారు. తమకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఎంజీ రామచంద్రన్, జయలలిత, కరుణానిధి, స్టాలిన్, విజయ్ కాంత్, శరత్ కుమార్, కమల్ హాసన్, నెపోలియన్, ఉదయనిధి స్టాలిన్, విశాల్, ఖుష్బూ, సీమాన్.. ఇలా చాలామంది నటులు తమిళ రాజకీయాల్లో గుర్తింపు పొందారు.
ఇప్పుడు తాజాగా అదే జాబితాలో నటి త్రిష కూడా చేరనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దక్షిణాదిన అన్ని భాషల్లోనూ నటించారామె. తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ను ఏర్పాటు చేసుకున్నారు. కొంతకాలంగా సినిమాల సంఖ్యను తగ్గించారు. ప్రస్తుతం పొన్నియన్ సెల్వన్ 1, పొన్నియన్ సెల్వన్ 2, చతురంగ వేట్టై, రామ్ 1, ది రోడ్ల సినిమాల్లో నటిస్తోన్నారు. మణిరత్నం దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న పొన్నియన్ సెల్వన్ 1 ఎపిక్ పీరియాడికల్ మూవీ.
కల్కి కృష్ణమూర్తి రాసిన నవల ఆధారంగా ఇది తెరకెక్కుతోంది. సెప్టెంబర్ 30వ తేదీన ఇది విడుదల కానుంది. ఆయా సినిమాలన్నింటినీ పూర్తి చేసుకున్న తరువాత.. పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి సారించాలనే ఆలోచనలో త్రిష ఉన్నారని చెబుతున్నారు. ఇదివరకు ఖుష్బూ కాంగ్రెస్లో సుదీర్ఘకాలం పని చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ఆమె పార్టీ ఫిరాయించారు. భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇప్పుడిక కాంగ్రెస్ పార్టీకి త్రిష గ్లామర్ తోడు కావడం దాదాపు ఖాయమైందని సమాచారం.