ఉక్రెయిన్ టు ఢిల్లీ: మరిన్ని విమానాలు: ఎయిరిండియా ఒక్కటే కాదు.. ఆ ఫ్లైట్స్ కూడా
న్యూఢిల్లీ: ఉక్రెయిన్లో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. అక్కడ నివసిస్తోన్న భారతీయ విద్యార్థులు, పౌరుల తరలింపుపై దృష్టి సారించింది. ఉక్రెయిన్లోని వేర్వేరు రీజియన్లలో 20 వేల మందికి పైగా భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. వేల సంఖ్యలో సాధారణ పౌరులు నివసిస్తోన్నారు. వారిని స్వదేశానికి రప్పించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది.
ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని డొనెట్స్క్, లుహాన్స్క్ రీజియన్లను సర్వ స్వతంత్రంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించిన తరువాత అంతర్జాతీయ స్థాయిలో పరిణామాలు శరవేగంగా చోటు చేసుకున్నాయి. అగ్రరాజ్యం అమెరికా స్వయంగా రంగంలోకి దిగింది. ఈ రెండు రీజియన్లు ఇక స్వతంత్రంగా వ్యవహరిస్తాయంటూ పుతిన్ చేసిన ప్రకటనను ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ తోసిపుచ్చారు. పుతిన్ తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతించట్లేదని తేల్చి చెప్పారు.
అక్కడితో ఆగలేదు బైడెన్. అత్యవసరంగా ఐక్యరాజ్య సమితి భద్రతమండలిని సమావేశ పరిచారు. కొద్దిసేపటి కిందటే ఈ భేటీ ముగిసింది. అమెరికా, భారత్, రష్యా, ఉక్రెయిన్, మెక్సికో, చైనా, బ్రెజిల్, నార్వే, ఫ్రాన్స్, సహా శాశ్వత, తాత్కాలిక సభ్య దేశాల రాయబారులు, ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. ఉక్రెయిన్ సంక్షోభ నివారణ, ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని పరిరక్షించడానికి ఎలాంటి చర్యలను తీసుకోవాల్సి ఉంటుందనే విషయంపై ప్రధానంగా ఇందులో చర్చించారు.
ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి ఈ భేటీలో పాల్గొన్నారు. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంపై భారత్ తరఫున తన విధానాన్ని ఆయన స్పష్టం చేశారు. ఉక్రెయిన్లో వేలాదిమంది భారతీయులు నివసిస్తోన్నారని, వారికి రక్షణ కల్పించడమే తమ తొలి ప్రాధాన్యత అని టీఎస్ తిరుమూర్తి స్పష్టం చేశారు. ఉక్రెయిన్లోని వేర్వేరు నగరాలు, రీజియన్లలో 20 వేల మందికి పైగా తమ దేశ విద్యార్థులు చదువుకుంటున్నారని పేర్కొన్నారు.
ఉక్రెయిన్ సరిహద్దు దేశాల్లోనూ పెద్ద సంఖ్యలో భారత పౌరులు నివసిస్తున్నారని, వారికి రక్షణను కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందని ఆయన తేల్చి చెప్పారు. దీనికోసం తాము చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. టీఎస్ తిరుమూర్తి ఈ ప్రకటన చేసిన కొద్దిసేపటికే ఉక్రెయిన్ రాజధాని కీవ్లోని భారత రాయబార కార్యాలయం కీలక ప్రకటన విడుదల చేసింది. కీవ్-ఢిల్లీ మధ్య ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రత్యేక విమాన సర్వీసుల సంఖ్యను పెంచినట్లు వెల్లడించింది.
ఉక్రెయిన్లో ఉన్న విద్యార్థులు, పౌరులు స్వదేశానికి తీసుకుని రావడానికి ఎయిరిండియా ఇదివరకే మూడు విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. తొలి విమానం ఈ ఉదయం ఢిల్లీ నుంచి కీవ్కు బయలుదేరి వెళ్లింది కూడా. 24, 26 తేదీల్లో మిగిలిన రెండు విమానాలు ఉక్రెయిన్కు వెళ్లాల్సి ఉంది.
Recommended Video
దీనికి అదనంగా 25, 27, మార్చి 6వ తేదీల్లో మరిన్ని విమాన సర్వీసులను నడిపించనున్నట్లు కీవ్లోని భారత ఎంబసీ వెల్లడించింది. 27వ తేదన రెండు విమానాలు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఎయిరిండియాతో పాటు ఎయిర్ అరేబియా, ఫ్లై దుబాయ్, ఖతర్ ఎయిర్వేస్ వంటి దేశాలు ఉక్రెయిన్ నుంచి భారత్కు విమానాలను నడిపిస్తోన్నాయి. ఉక్రెయిన్ను వీడాలనుకున్న వారు ఆయా ఫ్లైట్లలోనూ తమ టికెట్లను బుక్ చేసుకోవచ్చని ఎంబసీ స్పష్టం చేసింది.