జార్ఖండ్లో ముంచినా తేల్చినా వారే...!
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోరుకు సర్వం సిద్ధమైంది.15 జిల్లాల్లోని 43 అసెంబ్లీ స్థానాలకు బుధవారం పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ నిర్వహించనున్నారు. ఈ దశలో మొత్తం 683 మంది అభ్యర్థులు బరిలో నిలవగా..అందులో 73 మంది మహిళా క్యాండిడేట్స్, ఒక థర్డ్ జెండర్ అభ్యర్థి బరిలో నిలిచారు. ఓటింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించింది. ఈవీఎంలు, వీవీప్యాట్లు తీసుకొని పోలింగ్ సిబ్బంది ఇప్పటికే తమకు కేటాయించిన కేంద్రాలకు తరలివెళ్లారు.
జార్ఖండ్లో ఎన్డీఏ, ఇండియా కూటముల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఎన్డీఏ కూటమి నుంచి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు ప్రచారం చేశారు. బంగ్లా అక్రమ చొరబాట్ల అంశాన్ని బీజేపీ ప్రచార అస్త్రంగా చేసుకుంది. ఇండియా కూటమి తరఫున మల్లికార్జున ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్, ఆయన సతీమణి కల్పన ప్రచారం నిర్వహించారు. గిరిజన హక్కులతో సహా, ప్రజాకర్షక పథకాలను వారు తమ ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావించారు.

అయితే ఇక్కడ ఏ పార్టీ విజయం సాధించాలన్న కూడా ఆదివాసీలే కీలకంగా మారారు. మొత్తం 81 అసెంబ్లీ స్థానాల్లో 28 ఎస్టీ రిజర్వుడు సీట్లే కావడం విశేషం. 2019 ఎన్నికల్లో 28 ఎస్టీ స్థానాలకు గాను ఇండియా కూటమి సారథి జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ఏకంగా 19 సీట్లలో విజయం సాధించి అధికారాన్ని చేపట్టింది. గత ఎన్నికల్లో మాదిరిగానే ఆదివాసీల ఓట్లే గెలుపుకు కీలకంగా మారాయి. దీంతో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆదివాసీల ఓట్లు దక్కించునేలా తమ ఎన్నికల ప్రణాళికలు అమలు చేశాయి. ఎన్నికల హామీల్లో కూడా వారికే ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది. ఓటింగ్ మరికొద్ది గంటల సమయం మాత్రమే ఉండటంతో, ప్రజలు ఎవరికి పట్టం కడతారో,ఎవర్ని తిరస్కరిస్తారో అనే ఉత్కంఠ నెలకొంది. జార్ఖండ్లో రెండో దశ పోలింగ్ ఈ నెల 20న జరగనుంది. 23న ఫలితాలు వెల్లడి కానున్నాయి.












Click it and Unblock the Notifications