ఈసీ ప్రతిష్ట ఇంకాస్త దిగజారగా-సుప్రీంకోర్టులో ఈసీ తరఫు లాయర్ మోహిత్ రామ్ రాజీనామా -అనూహ్య వ్యాఖ్యలు
స్వతంత్ర ప్రతిపత్తిగల రాజ్యాంగ సంస్థ అయినప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రతిష్ట, పనితీరుపై ఇటీవల చర్చలు, విమర్శలు పెరిగాయి. మిగతా కేంద్ర సంస్థల మాదిరిగానే ఈసీ సైతం అధికార బీజేపీ చెప్పినట్లు ఆడుతోందని విపక్షాలు విమర్శిస్తుండగా, కరోనా విలయంలో ఈసీ తీరును కోర్టులు సైతం తప్పుపట్టాయి. ఈ క్రమంలో ఈసీ ప్రతిష్టను మరింత దిగజార్చే వ్యాఖ్యలు చేస్తూ ఆ సంస్థ తరఫు న్యాయవాది తన పదవికి రాజనీమా చేశారు..
అనూహ్యం: మోదీకి జగన్ ఊపిరి -ప్రధానిపై జార్ఖండ్ సీఎం విమర్శలకు ఏపీ సీఎం కౌంటర్ -డియర్ హేమంత్..
సుప్రీంకోర్టులో కేంద్ర ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది మోహిత్ డి.రామ్ శుక్రవారం రాజీనామా చేశారు. ఎన్నికల సంఘం విధానాలకు తన విలువలకు పొంతన కుదరడం లేదని, అందుకే రాజీనామా చేస్తున్నానని పేర్కొన్నారు. 2013 నుంచి సుప్రీంకోర్టులో ఎన్నికల సంఘం తరపు న్యాయవాదిగా కొనసాగిన మోహిత్ రామ్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతున్నది.
''కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతినిధిగా ఉండడం చాలా గౌరవంగా ఉంది. ఎన్నికల సంఘం స్టాండింగ్ కౌన్సిల్లో భాగం కావడం నుంచి ఎన్నికల సంఘం తరపు న్యాయవాదిగా ఇన్నేళ్ల నా ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లను అధిగమించాను. ప్రస్తుతం ఎన్నికల సంఘంలో కొనసాగుతున్న విధానాలకు నా విలువలు సరిపోలవనే విషయాన్ని గ్రహించాను. అందుకే సుప్రీంకోర్టు ముందు నా పదవీ బాధ్యతలను వదులుకోవాలని నిర్ణయం తీసుకున్నాను'' అని కమిషన్ డైరెక్టర్(లా)కు రాసిన లేఖలో మోహిత్ రామ్ పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం పెండింగ్లో ఉన్న ఫైల్స్, ఎన్ఓసీలను పూర్తిచేసే బాధ్యతను తాను తీసుకుంటానని ఆయన తెలిపారు.
కరోనా విలయంలో ఎన్నికలు నిర్వహించి, ప్రజల మరణాలకు బాధ్యులైన ఈసీ అధికారులపై హత్య కేసు పెట్టాలంటూ మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేయడం, సదరు వ్యాఖ్యలను రిపోర్ట్ చేసిన కారణంగా మీడియాపై ఆంక్షలు విధించాలని ఈసీ సుప్రీంకోర్టును ఆశ్రయించడం, అందుకు సర్వోన్నత న్యాయస్థానం నో చెప్పడం లాంటి తాజా పరిణామాలు మోహిత్ రామ్ ను ఇబ్బంది పెట్టాయని, అందుకే ఈసీ విధానాలతో తన విలువలు పొసగవంటూ ఆయన తప్పుకున్నారని తెలుస్తోంది.