యూపీ పోరు-అఖిలేష్ పొత్తులు కలిసొచ్చేనా ? గతంలో కాంగ్రెస్, బీఎస్పీ- ఇప్పుడు ఆప్
2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్ గా భావిస్తున్న ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు ఆసక్తి రేపుతున్నాయి. 403 సీట్లున్న యూపీ అసెంబ్లీని నెగ్గాలంటే ఒంటరి పోరుతో సాధ్యం కాదని భావిస్తున్న పార్టీలు పొత్తుల కోసం వ్యూహాలు రచిస్తున్నాయి. ఇందులో భాగంగా మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ ఛీఫ్ అఖిలేష్ యాదవ్ ఢిల్లీ సీఎం కేజ్రివాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. గతంలో కాంగ్రెస్, బీఎస్సీలతో పొత్తులు పెట్టుకుని మిశ్రమ ఫలితాలు అందుకున్న అఖిలేష్ ఈసారి ఆప్ తో తన లక్ష్యాన్ని అందుకుంటారా లేదా అన్న దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
యూపీ అసెంబ్లీ ఎన్నికలు
యూపీలో వచ్చే ఏడాది మార్చిలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. భారీ సంఖ్యలో ఉన్న అసెంబ్లీ సీట్లే ఇందుకు కారణం. యూపీలో నెగ్గాలంటే కుల సమీకరణాలతో పాటు ఎన్నో వ్యూహాలు తప్పనిసరి. దీంతో ఇప్పుడు అక్కడి రాజకీయ పార్టీలు ఎప్పటిలాగే వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఇందులో అధికార బీజేపీ మరోసారి ప్రభుత్వ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఎన్నికల బరిలోకి దిగుతోంది. అదే సమయంలో విపక్ష ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్, ఆప్ కూడా బీజేపీని టార్గెట్ చేస్తున్నాయి. బీజేపీని ఈసారి ఎలాగైనా గద్దె దింపాలన్న లక్ష్యంతో ఆయా పార్టీలు పావులు కదుపుతున్నాయి.
యోగీ సర్కార్ పై వ్యతిరేకతే ఆయుధం
యూపీలో ఇప్పుడు విపక్షాలకు ప్రధాన ఆయుధం యోగీ ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతే. ముఖ్యంగా ఈ ఐదేళ్లలో యోగీ సర్కార్ తీసుకున్న పలు వివాదాస్పద నిర్ణయాలు, పెరిగిన క్రైమ్ రేట్, హత్రాస్, లఖీంపూర్ వంటి ఘటనలు ఇప్పుడు విపక్షాలకు ప్రధాన ఆయుధంగా మారిపోయాయి. దీంతో పాటు పెరిగిన ధరలు, ముస్లింలను, ఇతర మైనార్టీలను టార్గెట్ చేస్తూ యోగీ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు విపక్షాలకు వరంగా మారాయి. దీంతో ఇప్పుడు వాటిని ఆయుధంగా చేసుకుని వచ్చే ఏడాది జరిగే యూపీ అసెంబ్లీ పోరుకు అవి సిద్ధమవుతున్నాయి.
అఖిలేష్ పొత్తుల చరిత్ర
గతంలో 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న అఖిలేష్ యాదవ్.. అఫ్పట్లో యువనేత రాహుల్ గాంధీతో కలిసి హల్ చల్ చేశారు. అఖిలేష్-రాహుల్ యువ నేతల ద్వయంతో యూపీలో అభివృద్ధి సాధ్యమని ప్రచారం చేశారు. వీరిద్దరూ కలిస్తే యూపీ దూసుకుపోతుందని ఓటర్లను నమ్మించేందుకు ప్రయత్నించారు. కానీ వారు నమ్మలేదు. దీంతో ఈ పొత్తు ప్రయోగం వికటించింది. ఆ తర్వాత 2019 సార్వత్రిక ఎన్నికల్లో అఖిలేష్.. బీఎస్పీ అధినేత్రి మాయావతితో పొత్తు పెట్టుకున్నారు. వీరిద్దరూ కలిసి పోటీ చేసినా ఇద్దరికీ కలిపి 15 ఎంపీ సీట్లు మాత్రమే దక్కాయి. అయితే గతంలో 2014 సార్వత్రిక పోరులో సున్నాకు పరిమితమైన మాయావతి ఈసారి ఏకంగా 10 సీట్లు గెల్చుకుంది. ఎస్పీకి మాత్రం గతంలో గెల్చిన ఐదుసీట్లే దక్కాయి. దీంతో ఈ పొత్తు కూడా అంతగా ఫలించలేదు. దీంతో నిరాశపడని అఖిలేష్ మరో పొత్తుకు సిద్ధమయ్యారు.
ఆమ్ ఆద్మీతో అఖిలేష్ పొత్తు
గతంలో కాంగ్రెస్, బీఎస్పీలతో పొత్తులు పెట్టుకుని విఫలమైన ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్.. ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తుకు సిద్ధమయ్యారు. యూపీలో ప్రజా వ్యతిరేకతను తట్టుకుని మరోసారి యోగీ సర్కార్ గెలవడం అసాధ్యమని భావిస్తున్న విపక్ష సమాజ్ వాదీ పార్టీ.. ఇప్పుడు ఢిల్లీలో విజయవంతంగా దూసుకుపోతున్న కేజ్రివాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకుంది. తద్వారా ఆమ్ ఆద్మీకి ఉన్న క్లీన్ ఇమేజ్ తనకు ఉపయోగపడుతుందని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ భావిస్తున్నారు. కేజ్రివాల్ ప్రచారం, ఆయనకున్న అభివృద్ధి సాధకుడన్న పేరు యూపీలో తమ పార్టీకి మేలు చేస్తుందని అఖిలేష్ అంచనా వేస్తున్నారు. దీంతో ఆమ్ ఆద్మీతో పొత్తు పెట్టుకుని యూపీ పోరు ఎదుర్కొనేందుకు ఆయన సిద్ధమయ్యారు. అదే సమయంలో ఆయన మరో రెండు చిన్న పార్టీలతోనూ పొత్తుకు రెడీ అవుతున్నారు. ఇందులో ఓం ప్రకాష్ రాజ్ భర్ నేతృత్వంలోని సుహేల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్బీఎస్పీ), జయంత్ చౌదరి నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ దళ్ ఉన్నాయి. వీరిద్దరితో త్వరలో సమాజ్ వాదీ పార్టీ పొత్తు కుదుర్చుకోనుంది. దీంతో ఈసారైనా అఖిలేష్ తలరాత మారుతుందేమో చూడాలి.