షాక్: దెయ్యాన్ని పట్టుకోమని పోలీసులకు ఫిర్యాదు
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం పోలీసులకు మరో కొత్త తలనొప్పి వచ్చి పడింది. మొన్నటి వరకు ప్రముఖుల ఇళ్లల్లో గేదెలు, కుక్కలు, కోళ్లు దొంగిలించారని, వాటిని పట్టుకోమని ఫిర్యాదులు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మాత్రం ఏకంగా దెయ్యాన్ని పట్టుకోమని ఫిర్యాదు రావడంతో ఏం చేయాలో దిక్కుతోచని తలలు పట్టుకుంటున్నారు.
అలహాబాద్ ప్రాంత ప్రజలను ఒక దెయ్యం వేధిస్తోందని దానిని పట్టుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంత్ నిరంకారి రైల్వే స్టేషన్ క్రాసింగ్ వద్ద ఓ వికృత రూపం కలిగిన దెయ్యం సంచరిస్తోందనే వదంతులు ఆ ప్రాంతమంత వ్యాపించాయి.
అంతేగాక, ఆ ప్రాంతంలో దెయ్యం తిరుగుతోందన్న వార్త సోషల్ మీడియా ద్వారా రాష్ట్రమంతా వ్యాపించేసింది. దీంతో ఆ ప్రాంతంలో ఉండేందుకు ప్రజలు భయపడుతున్నారు. అక్కడి నుంచి వేరే ప్రాంతాలకు తరలివెళుతున్నారు. దీంతో దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని ఉన్నతాధికారులు పోలీసులను ఆదేశించారు.
రాత్రి సమయాల్లో అక్కడ పెట్రోలింగ్ చేపట్టాలని సూచించారు. దెయ్యం పేరుతో ప్రజలను భయపెట్టి దోపిడీలకు పాల్పడాలన్న ఉద్దేశంతో సంఘవిద్రోహశక్తులే ఈ వదంతులు వ్యాపింపజేస్తున్నాయని పోలీసులు పేర్కొంటున్నారు. ఏదేమైనా ఇప్పుడు దెయ్యాల అంతు చూసేందుకు యుపి పోలీసులు సిద్ధమయ్యారు.