ఇక కర్ణాటక వంతు.. జల్లికట్టు లాగే 'కంబళ' కోసం కన్నడిగుల ఉద్యమం
కంబళకు మద్దతు కోరుతూ ఈ నెల 28న 250జతల దున్నపోతులతో భారీ ర్యాలీ నిర్వహించబోతున్నారు.
కర్ణాటక: ఒక్క జల్లికట్టు ఉద్యమం మొత్తం దక్షిణాదినే ప్రభావితం చేసేదిగా మారింది. జల్లికట్టు ఉద్యమ స్పూర్తితో ఏపీలో ప్రత్యేక హోదా ఉద్యమం ఊపందుకోనుండగా.. ఇదే ఎఫెక్ట్ అటు కర్ణాటకపై కూడా పడింది. జల్లికట్టుకు అనుమతించినట్టే.. తమ రాష్ట్రంలోని సాంప్రదాయ క్రీడ కంబళకు కూడా మద్దతునివ్వాలని కన్నడిగులు తమ డిమాండ్ను తెరపైకి తీసుకొచ్చారు.
ఎడ్ల పందాల తరహాలో సాగే దున్నపోతుల పోటీని కన్నడిగులు కంబళ అని సంబోధిస్తారు. జల్లికట్టుపై ఆర్డినెన్స్కు కేంద్రం సానుకూలంగా ఉండటంతో.. తమ సాంపద్రాయ క్రీడ కంబళపై కూడా నిషేధం ఎత్తివేయాలని కర్ణాటక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
జల్లికట్టులో లాగా ఇందులో ప్రమాదాలు చోటు చేసుకోవడం.. ప్రమాదవశాత్తు వ్యక్తులు మరణించడానికి అవకాశం లేదని.. కాబట్టి కంబళకు అనుమతినివ్వాలని వారు కోరుతున్నారు. కాగా, జల్లికట్టుకు వ్యతిరేకంగా కేసు వేసిన పెటా.. అదే సమయంలో కంబళను కూడా నిషేధించాలంటూ కోర్టుకెక్కడంతో కర్ణాటక హైకోర్టు దీనిపై నిషేధం విధించింది.
హైకోర్టు నిషేధం ప్రకటించడంతో ఏడాది కాలంగా కర్ణాటకలో కంబళకు తెరపడింది. అయితే తమిళ యువత చేపట్టిన ఆందోళనలతో జల్లికట్టుపై కేంద్రం దిగిరావడంతో.. అదే స్పూర్తితో ఇప్పుడు కన్నడిగులు కూడా కంబళ కోసం ఉద్యమించనున్నారు. ఈ ఉద్యమానికి కర్ణాటక సీఎం సిద్దరామయ్య నాయకత్వం వహించబోతుండటం గమనార్హం.
Kambala is our pride.. Words can't describe the emotion we carry behind of these....#Isupportkambala #Savekambala#Jaikambala #Kambalabeku pic.twitter.com/LeU2fNzyKb
— PRAVEEN NAYAK (@pravee_putta) January 23, 2017
కంబళకు మద్దతు కోరుతూ ఈ నెల 28న 250జతల దున్నపోతులతో భారీ ర్యాలీ నిర్వహించబోతున్నారు. కాగా, కంబళ వ్యతిరేక పిటిషన్లపై కర్ణాటక హైకోర్టులో ఈ నెల 30న విచారణ జరగనుంది. కంబళను వ్యతిరేకిస్తున్న పిటిషన్లను వెనక్కి తీసుకోవాల్సిందిగా కర్ణాటక ప్రభుత్వం ఆయా సంస్థలను కోరింది.
ఇదంతా ఇలా ఉంటే, 2018లో కర్ణాటకకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో కేవలం ఎన్నికల లబ్ది కోసమే కాంగ్రెస్ కంబళను తెరపైకి తీసుకొచ్చిందన్న వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి.
TN has no BJP MPs and yet #jallikattu is passed & Kar has 17 #BJP MPs, but why silent on #Kambala ? #SaveKambala #ISupportKambala
— Durga Ramdas Kateel (@durgaramdas) January 23, 2017
కర్ణాటక సోషల్ మీడియాలోను దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసలు బీజేపీ ప్రాబల్యమే లేని తమిళనాడులో జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయడం సాధ్యమైనప్పుడు.. 17మంది బీజేపీ ఎంపీలు ఉన్న కర్ణాటకలో మాత్రం కంబళపై మౌనం వహించడమేంటి? అని నెటిజెన్స్ ప్రశ్నిస్తున్నారు