ఆ ఇద్దరు ఎంపీల రాజీనామాతో లోక్సభలో 271కు తగ్గిన బిజెపి బలం
న్యూఢిల్లీ: కర్ణాటక రాష్ట్రం నుండి బిజెపి ఎంపీలుగా ప్రాతినిథ్యం వహిస్తున్న యడ్యూరప్ప, శ్రీరాములు రాజీనామాలతో లోక్సభలో బిజెపి సంఖ్య బలం 271కు తగ్గిపోయింది. వీరిద్దరి రాజీనామాకు ముందు లోక్సభలో బిజెపి సంఖ్యాబలం 273గా ఉండేది.
లోక్సభ సభ్యులుగా ఉన్న యడ్యూరప్ప, శ్రీరాములు కర్ణాటక అసెంబ్లీకి మే 12వ తేదిన జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేశారు. వీరిద్దరూ కూడ ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే యడ్యూరప్ప మే 17వ తేదిన సీఎంగా ప్రమాణం చేశారు. మే 19 వ తేదిన విశ్వాస పరీక్షకు ముందే ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. అయితే విశ్వాస పరీక్షకు ముందే ఎమ్మెల్యేగా ప్రమాణం చేయడానికి గాను వీలుగా యడ్యూరప్ప , శ్రీరాములు ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఒకే సమయంలో ఎంపీగా కొనసాగుతూ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయడానికి నిబంధనలు ఒప్పుకోనందున శ్రీరాములు, యడ్యూరప్ప రాజీనామాలను ఆమోదించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
దీంతో 273 సభ్యులున్న బిజెపి బలం లోక్సభలో 271కు పడిపోయింది.2014 ఎన్నికల్లో బిజెపి 282 ఎంపీలను కైవసం చేసుకొంది. అయితే ఇటీవల కాలంలో జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపి 6 ఎంపీ సీట్లను కోల్పోయింది. ఈ ఎన్నికల్లో ప్రత్యర్ధులు విజయం సాధించారు. మరోవైపు ముగ్గురు బిజెపి ఎంపీలు మరణించడంతో ఆ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. దీంతో కనీస మెజారిటీకి మరో రెండు సభ్యుల దూరంలో బిజెపి నిలబడిన పరిస్థితులు నెలకొన్నాయి.
అయితే మే 21వరకు లోక్సభ వెబ్సైట్ లో ఏడు స్థానాలు ఖాళీగా ఉన్నాయని చూపింది. శివమొగ్గ, బళ్ళారి ఎంపీ స్థానాలు కూడ ఖాళీగా ఉన్నాయని ఆ సైట్ లో చూపారు. కానీ, మే 22వ, తేదిన మాత్రం కేవలం 5 ఎంపీ స్థానాలు మాత్రమే ఖాళీగా ఉన్నాయని చూపినట్టుగా ఓ జాతీయ వెబ్సైట్ ప్రకటించింది. ఈ సైట్ కథనం ప్రకారంగా యడ్యూరప్ప, శ్రీరాములు స్థానాలు ఖాళీ కాలేదని చూపినట్టుగా ఆ సైట్ ఆ కథనంలో ప్రకటించింది.
అయితే రాజ్యాంగ నిబంధనల ప్రకారంగా ఒకే సమయంలో ఎంపీగా, ఎమ్మెల్యేగా ఒకే సమయంలో ఒక సభ్యుడు కొనసాగడం నిబంధనలకు విరుద్దం. ఒక సభ్యుడు ఎంపీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి కనీసం 14 రోజుల సమయం ఉంది. అయితే యడ్యూరప్ప, శ్రీరాములు మే 19వ తేదిన రాజీనామాలు చేసినందున ఈ రెండు స్థానాలు కూడ బిజెపికి తగ్గిపోయాయి.
అయితే సభ్యులు రాజీనామాలు చేసిన తర్వాత ఆ రాజీనామాలను ఆమోదించడం స్పీకర్ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. అయితే యడ్యూరప్ప, శ్రీరాములు సీట్లు ఖాళీ కాలేదని లోక్సభ వెబ్ సైట్ ప్రకటించడం వెనుక స్పీకర్ సుమిత్రా మహాజన్ వీరిద్దరి రాజీనామాలను ఆమోదించలేదని అర్ధమౌతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారని ఆ వెబ్సైట్ ప్రచురించింది.
యడ్యూరప్ప, శ్రీరాములు రాజీనామాలను ఆమోదం పొందితే వారు తాము ప్రాతినిథ్యం వహిస్తున్న అసెంబ్లీ స్థానాల ప్రజలకు సేవ చేయొచ్చు. కానీ బిజెపి స్వంతంగా లోక్సభలో మెజారిటీని కోల్పోతోంది. కానీ, ఎన్డీఏలోని ఇతర పార్టీల మీద ఆధారపడి బిజెపి ప్రభుత్వం మనుగడ సాగే అవకాశం ఉంది.
అయితే ఇప్పటికే బిజెపి ఒక ఎంపీని పార్టీ నుండి సస్పెండ్ చేసింది. బీహర్ కు చెందిన మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ను పార్టీ నుండి సస్పెండ్ చేసింది. ఇదే రాష్ట్రానికి చెందిన సినీ నటుడు శతృఘ్నుసిన్హా కూడ మోడీకి వ్యతిరేకంగా విమర్శలు గుప్పిస్తున్నాడు.
లోక్సభలో శివసేనకు 18 మంది ఎంపీలున్నారు. అయితే ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకొంటామని ఆ పార్టీ బెదిరిస్తోంది. 2019 ఎన్నికల్లో స్వంతంగా పోటీ చేస్తామని ఆ పార్టీ ఇప్పటికే ప్రకటించింది.మరో వైపు జమ్మూలో బిజెపితో పొత్తులో ఉన్న పీపుల్స్ డమోక్రటిక్ ఫ్రంట్ పార్టీ శ్రీనర్ ఎంపీ సీటును నేషనల్ కాన్పరెన్స్ పార్టీకి కోల్పోయింది.
మేఘాలయ సీఎం సంగ్మా మేఘాలయ స్థానం నుండి గతంలో ప్రాతినిథ్యం వహించారు. దీంతో ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ సీటు కూడ ఖాళీగానే ఉంది.
మే 28వ తేదిన నాలుగు ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే తాజాగా కర్ణాటకకు చెందిన శ్రీరాములు, యడ్యూరప్ప రాజీనామాలను ఆమోదించినట్టుగా లోక్సభ కార్యాలయం బులెటిన్ ను విడుదల చేసిందని ఆ వెబ్ సైట్ ప్రకటించింది.