చెక్ పాయింట్లు... ఐసోలేషన్ వార్డులు.. నిఫాపై పొరుగు రాష్ట్రాలు అప్రమత్తం..
కేరళలో నిఫా వైరస్ బారినపడ్డ 23 ఏళ్ల యువకుడు క్రమంగా కోలుకుంటున్నాడు. వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. ఒకవేళ ఎవరికైనా వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే చికిత్స అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేసింది. ఇదిలా ఉంటే కేరళలో నిఫా కేసు నమోదుకావడంతో పొరుగు రాష్ట్రాల్లో వణుకు మొదలైంది. కర్నాటక, తమిళనాడుతో పాటు రాజస్థాన్ ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో నిఫా వైరస్ ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించాయి.
నిఫా అలర్ట్... మరో ఆరుగురికి వైద్య పరీక్షలు.. వైరస్ సోకలేదని నిర్థారణ..
అప్రమత్తమైన కర్నాటక
కేరళలో నిఫా వైరస్ కేసు నమోదుకావడంతో కర్నాటక ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. వైరస్ నివారించేందుకు చర్యలు ప్రారంభించింది. కేరళ సరిహద్దు జిల్లాలైన చామరాజనగర్, మైసూరు, కొడగు, దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ, ఉడిపి, శివమొగ్గ, చిక్కమంగళూరు వైద్యాధికారులకు సర్క్యులర్ జారీ చేసిన ప్రభుత్వం వారిని అప్రమత్తం చేసింది. ఆయా జిల్లాల్లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్, వెటర్నరీ డిపార్ట్మెంట్లతో ఇంటర్ డిపార్ట్మెంటల్ కో ఆర్డినేషన్ కమిటీ మీటింగ్ నిర్వహించాలని స్పష్టం చేసింది.
ఐసోలేషన్ వార్డుల ఏర్పాటు
రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయాలని ఆరోగ్య శాఖ ఆదేశించింది. వైరస్ సోకిన వారి ట్రీట్మెంట్కు అవసరమైన మందులు, ఇతరత్రా సౌకర్యాలపై దృష్టి సారించాలని చెప్పింది. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్లో నమోదైన అనుమానిత కేసులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించింది. పేషెంట్లో నిఫా వైరస్ లక్షణాలు కనిపించిన వెంటనే వారిని ఐసోలేషన్ వార్డుకు తరలించి పరీక్షలు నిర్వహించడంతో పాటు వారు ఎక్కడెక్కడికి వెళ్లారన్న వివరాలను నమోదుచేయాలని చెప్పింది.
చెక్ పాయింట్ల వద్ద పరీక్షలు
అటు తమిళనాడు ప్రభుత్వం సైతం కన్యాకుమారి, నీలగిరి, కోయంబత్తూరు, దిండిగుల్, తిరునల్వేలి, థేనీ జి్లాల్లో హై అలర్ట్ ప్రకటించింది. నిఫా వైరస్ సోకకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు రాష్ట్రంలోని అన్ని మేజర్ డిస్ట్రిక్ హాస్పిటల్స్లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేశారు. మధురైలో నిఫా పేషెంట్ల కోసం 33 బెడ్లతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అందుబాటులోకి తెచ్చారు. కేరళ నుంచి వచ్చే బస్సులను చెక్ పాయింట్ల వద్ద నిలిపి డాక్టర్లు ప్రతి ప్రయాణికున్ని పరిశీలిస్తున్నారు. అనుమానం వచ్చిన వారికి మరిన్ని పరీక్షలు నిర్వహించి వైరస్ లేదని నిర్థారించుకున్నాకే తమిళనాడులోకి ప్రవేశించేందుకు అనుమతిస్తున్నారు.
రాజస్థాన్లో హెల్త్ అడ్వైజరీ జారీ
నిఫా వైరస్ను ప్రబలకుండా రాజస్థాన్ ప్రభుత్వం సైతం చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ రాష్ట్రంలోని అన్ని మెడికల్, హెల్త్ అఫీషియల్స్కు మార్గదర్శకాలు జారీ చేసింది. వైరస్ లక్షణాలు కనిపించిన పేషంట్లను గుర్తించి అవసరమైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని ర్యాపిడ్ రెస్పాన్స్ టీంను ప్రభుత్వం ఆదేశించింది. నిఫా వైరస్కు సంబంధించి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించింది. కేరళకు వెళ్లి వచ్చిన వ్యక్తులు దగ్గు, జలుబు, జ్వరం బారిన పడితే వెంటనే హాస్పిటల్కు వెళ్లాలని రాజస్థాన్ ఆరోగ్య శాఖ మంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.