హత్యచేసి డెడ్బాడీలు ఫ్రిజ్లు, సూట్కేసులలో పెడుతున్నారు.. ఇలాంటి క్రూరమైన హత్యలకు ఐడియాలు ఎక్కడినుంచంటే..
30 ఏళ్ల క్రితం దేశ రాజధాని దిల్లీకి చెందిన ఒక శాస్త్రవేత్త.. ఇంట్లో జరిగిన ఒక చిన్న గొడవకు కోపం తెచ్చుకుని తన భార్యను అత్యంత క్రూరంగా హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి, వాటిని ఒక పెట్టెలో పెట్టాడు.
ఆ పెట్టె తీసుకుని రద్దీగా ఉన్న రైలులో 1,500 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న హైదరాబాద్ చేరుకున్నాడు.
బురద నీటితో నిండి ఉన్న ఒక చెరువు దగ్గర్లో హోటల్ తీసుకుని, ఆ తర్వాత కొన్ని రోజుల్లో ముక్కలు ముక్కలుగా చేసిన తన భార్య శవాన్ని ఆ చెరువులో పడేశాడు.
ఒక రోజు ఆకలితో ఉన్న వీధి కుక్క ఒకటి చెరువులో దొరికిన మనిషి చేతిని నోటితో పట్టుకుని రోడ్డు మీదకు వచ్చింది.
''ఈ శాస్త్రవేత్త తన భార్య హత్యకు చెందిన సాక్ష్యాధారాలను చెరిపేసేందుకు ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి, మరో నగరానికి తీసుకెళ్లాడు. ఈ కిరాతక విధానం విన్న తర్వాత మేమెంతో ఆశ్చర్యానికి గురయ్యాం. ఏదైనా పుస్తకాన్ని కానీ సినిమాను కానీ ప్రేరణగా తీసుకుని ఈయన తన భార్య శరీర అవయవాలను డిస్పోజ్ చేశాడు’’ అని దిల్లీకి చెందిన సీనియర్ పోలీసు అధికారి దీపేంద్ర పఠాక్ గుర్తుకు చేసుకున్నారు.
ఇటీవల కాలంలో భారత్లో ఇలాంటి హత్యలు వార్తాపత్రికలలో ప్రధానాంశంగా నిలుస్తున్నాయి. ఈ హత్యలన్ని కాపీక్యాట్ మర్డర్లేనా? అనే సందేహాలు కూడా తలెత్తుతున్నాయి.
కాపీక్యాట్ మర్డర్లంటే అంతకుముందు జరిగిన ఏవైనా నేరాల నుంచి ప్రేరణ పొంది అదే తరహాలో మరో నేరానికి పాల్పడడం.
ప్రతి కేసులో కూడా బాధితులు క్రూరంగా హత్యకు గురవుతున్నారు. ఆ తర్వాత హత్య చేసిన వ్యక్తులు వారి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి, వాటిని ఫ్రిజ్లో లేదా సూట్కేసులో దాచి పెడుతున్నారు.
ఇలా దాచిపెట్టిన శరీర భాగాలను ఎవరూ చూడని సమయంలో సమీపంలోని అడవుల్లో, చెత్తకుప్పల్లో, నిర్జన ప్రాంతాల్లో పడేస్తున్నారు.
అయితే భారత్లో ఇలాంటి హత్యలకు సంబంధించిన పూర్తిస్థాయి డాటా అందుబాటులో లేదు.
2021లో మొత్తంగా 29 వేలకు పైగా హత్య కేసులు నమోదయ్యాయి. 2020తో పోలిస్తే ఈ సంఖ్య 0.3 శాతం పెరిగింది.
వీటిలో చాలా హత్యలు వ్యక్తిగత పగ, శత్రుత్వాలు, ఆర్థిక లావాదేవీల కారణంగా ఇద్దరి మధ్య తలెత్తే ఘర్షణల ఫలితంగా జరిగినవేనని దర్యాప్తుల్లో తేలింది.
అయితే, హత్యకు గురైనవారిలో ఎందరి మృతదేహాలను హంతకులు ఇలా ముక్కలుముక్కలుగా నరికారో... వారిని చంపడానికి ఎలాంటి ఆయుధాలు వాడారనేది తెలియదు.
- శ్రద్ధ వాల్కర్, అఫ్తాబ్ పూనావాలా: 'ఫ్రిడ్జ్ మర్డర్’ మీద వస్తున్న సంచలన వార్తల్లో నిజానిజాలేంటి?
- నాలుగేళ్ల క్రితం ఆస్ట్రేలియా బీచ్లో యువతి హత్య.. ఇప్పుడు భారత్లో నిందితుడి అరెస్ట్.. ఎలాగంటే..
''కాపీక్యాట్ మర్డర్, మర్డర్ సూసైడ్(కుటుంబసభ్యులను చంపి తాను ఆత్మహత్య చేసుకోవడం)లు జరుగుతున్నాయనేది మాత్రం వాస్తవం. మీడియాలో వచ్చే కథనాలు ఇలాంటి ధోరణిని మరింత పెంచుతున్నాయి’ అని కల్చరల్ బిహేవియరిస్ట్ లోరెన్ కోలెమాన్ అన్నారు.
ఈయన మీడియా కవర్ చేసే నేరాలు ప్రజలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతున్నాయో అధ్యయనం చేశారు.
ఇటీవల దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన శ్రద్ధా వాల్కర్ హత్య గురించి తెలిసిందే. ఆమెను అత్యంత కిరాతంగా హత్య చేశాడనే ఆరోపణలతో నవంబర్ నెలలో తన పార్టనర్ ఆఫ్తాబ్ పూనావాలాపై కేసు నమోదైంది.
అయితే ఈ హత్యను ఆఫ్తాబ్ పూనావాలా.. అమెరికా క్రైమ్ డ్రామా సిరీస్ డెక్స్టర్ను ప్రేరణగా తీసుకుని చేసినట్టు ఆరోపణలున్నాయి.
ఈ సినిమాలో ఫోరెన్సిక్ బ్లడ్ స్ప్లాటర్ అనలిస్టుగా పనిచేసే వ్యక్తి సీరియల్ కిల్లర్గా మారి ఎంతో మందిని హత్య చేస్తుంటాడు.
ఆఫ్తాబ్ పూనావాలా కూడా శ్రద్ధా వాల్కర్ను చంపేసి, ఆమె శరీరాన్ని 36 ముక్కలుగా కోసి, వాటిని రిఫ్రిజిరేటర్లో దాచిపెట్టి, ఆ తర్వాత తమ ఇంటికి దగ్గర్లో ఉన్న అడవులో విసిరేసినట్టు పోలీసులు చెప్తున్నారు.
ఇలాంటి హత్యలు ప్రజల్లో క్రూరత్వాన్ని క్రియేట్ చేస్తున్నాయని, కాపీక్యాట్ నేరాల చేసేలా పురిగొల్పుతున్నాయని క్రిమినల్ సైకాలజిస్ట్ అనుజా కపూర్ అన్నారు.
అయితే భారత్లో జరుగుతున్న ఫ్రిజ్, సూట్కేసు హత్యలను మీడియా సెన్సేషనలైజ్ చేయడం వల్ల అది కొందరిలో హిస్టీరియా తరహా తీవ్ర మానసికపరిస్థితులకు దారితీయొచ్చని.. అలాంటివారు ఇలాంటి కాపీక్యాట్ నేరాలకు పాల్పడేలా పురిగొల్పే ప్రమాదం ఉందని అనూజా చెప్పారు.
''కాపీక్యాట్ నేరాలు వాస్తవమైనవే. కానీ, నా అనుభవం ప్రకారం, హత్యకు పాల్పడేవారు గతంలో జరిగిన నేరాల నుంచి కాకుండా తాము చదివిన నవలలు, చూసిన సినిమాలలో ఇలా సాక్ష్యాధారాలు చెరిపేసే పద్ధతులను తెలుసుకుంటున్నారు’ అన్నారు దీపేంద్ర పాఠక్.
'హత్య చేసిన మృతదేహాన్ని ముక్కలుముక్కలుగా నరికేసిన కేసులు చాలా అరుదుగా బయటికి వస్తున్నాయి, కానీ ప్రతి సమయంలో ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. చాలా కేసులను మీడియా రిపోర్టు చేయడం లేదు. ఈ హత్యలకు సంబంధించిన మూడు కేసులను నేను చూశాను. ఇలా ముక్కలుముక్కలుగా మృతదేహాన్ని నరికివేయడాన్ని మీడియా అసలు కవర్ చేయలేదు’’ అని దిల్లీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సస్ ఫోరెన్సిక్ మెడిసిన్ హెడ్ సుధీర్ కె.గుప్తా తెలిపారు.
- పెళ్లి చేసుకోవాలని అడిగినందుకు ప్రియురాలిని 35 ముక్కలుగా నరికి ఫ్రిజ్లో దాచాడు... 18 రోజుల తరువాత దిల్లీ సిటీలో విసిరేశాడు
- ఇద్దరూ పెళ్లైనవాళ్లే.. 'ఫేస్బుక్లో ప్రేమించుకున్నారు’.. నిజామాబాద్ నుంచి యూపీ వెళ్లిన మహిళ, హత్య చేసిన 'లవర్’
మూడు దశాబ్దాల క్రితం భారత్లో ఫోరెన్సిక్ సర్జన్గా డాక్టర్ గుప్తా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు.
అప్పటి నుంచి ఎన్నో కేసులను ఆయన డీల్ చేశారు.
ఈయన దృష్టికి వచ్చిన కేసులలో.. బాధితులను వారి ఇళ్ల నుంచి బయటికి రప్పించి, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి చంపేశారు హంతకులు.
ఆ తర్వాత వారి మృతదేహాన్ని ముక్కలుముక్కలుగా నరికి అడవిలో పడేసినట్లు చెప్పారు.
ఎక్కువగా హత్యలు కూడా జనసంచారం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో జరుగుతున్నాయి.
అలాంటి ప్రాంతాల్లో హత్య చేసిన తర్వాత వారి మృతదేహాన్ని ముక్కలుముక్కలు నరికి, సాక్ష్యాధారాలు చెరిపేస్తున్నారు హంతకులు.
శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికేయడం వల్ల హతులను గుర్తించడం, శరీర భాగాలను ఒక దగ్గర చేసి ఫోరెన్సిక్ రీకన్స్ట్రక్షన్ చేపట్టడం, హత్యకు దారి తీసిన పరిణామాలు కనుగొనడం సవాలుగా మారుతున్నట్టు దిల్లీలోని ఎయిమ్స్లో ఫోరెన్సిక్ మెడిసన్ విభాగాధిపతి డాక్టర్ సుధీర్ గుప్తా తెలిపారు.
కానీ, మనుషుల ఎముకలను పరిశీలిస్తే చనిపోయిన వారు ఆడనా, మగనా, వారి వయసెంత, పుట్టిన తేదీ, ఏ కారణం చేత చనిపోయారు వంటి విషయాలన్నింటిన్ని చెప్పగలమని గుప్తా చెప్పారు.
ఇతర దేశాల్లోనూ ఈ తరహా నేరాలు జరుగుతున్నాయి.
ఫిన్ల్యాండ్లో పదేళ్లలో 13 కేసులపై చేపట్టిన అధ్యయనంలో.. బాధితులందరూ కూడా హంతకులకు బాగా తెలిసిన వారే. వారిలో సగం మంది జీవిత భాగస్వాములు లేదా కుటుంబ సభ్యులే.
మరోవైపు ఈ కేసుల్లో హంతకులకు మానవ శరీర నిర్మాణానికి సంబంధించిన విద్య, ఉద్యోగ నేపథ్యాలేమీ లేవు. వీళ్లలో చాలామంది నిరుద్యోగులు.
అయితే భారత్లో ఇలా మృతదేహాలను ముక్కులు చేసిన కేసులకు సంబంధించిన సమాచారం పెద్దగా అందుబాటులో లేదు.
ఈ తరహా హత్యలు చేసినవారు ఎంతమంది లొంగిపోయారు, ఎన్ని కేసులను పోలీసులు ఛేదించి హంతకులను పట్టుకున్నారనేది పూర్తిగా తెలియదు.
'భారత ఆధునిక సమాజంలో సంబంధాల్లోని బలహీనతలను ఈ హత్యలు బహిర్గతం చేస్తున్నాయి. వైవాహిక జీవితంలో గొడవలు, వివాహేతర సంబంధాలు, సహజీవనాలు వంటివి ఇలాంటి హత్యలకు కారణాలవుతున్నాయి’ అని పాఠక్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ప్రపంచ కుబేరుని కథ: ఎలాన్ మస్క్ను వెనక్కి నెట్టిన బెర్నార్ ఆర్నో ఎవరు
- ''జీతాలు పెరగలేదు.. రెండు ఉద్యోగాలు చేసినా పూట గడవటం కష్టమవుతోంది’’
- రిషి రాజ్పోపట్: 2500 ఏళ్ల నాటి సంస్కృత సమస్యకు.. భారతీయ విద్యార్థి పరిష్కారం
- భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో 7 కిలోమీటర్ల పొడవైన లఖ్పత్ కోట గురించి మీకు తెలుసా?
- అక్కడ చికెన్ కంటే ఎలుక మాంసం ధర ఎక్కువ... దీని రుచి ఎలా ఉంటుంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)