మద్యం పాలసీపై ఢిల్లీ సర్కార్ యూటర్న్-లెఫ్టినెంట్ గవర్నర్ పోరుతో-ఆరునెలల్లో కొత్త విధానం
ఢిల్లీలో కేజ్రివాల్ సర్కార్ పై ఆధిపత్యం కోసం లెఫ్టినెంట్ గవర్నర్ సాయంతో కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు చివరికి మద్యం విధానంలో మార్పులకు దారి తీస్తున్నాయి. కేజ్రివాల్ సర్కార్ తీసుకొస్తున్న మద్యం విధానంలో అక్రమాలు జరుగుతున్నాయంటూ లెఫ్టినెంట్ గవర్నర్ ఆరోపించడం, ఆ తర్వాత సీబీఐ విచారణ నేపథ్యంలో దాన్ని త్వరలో ఉపసంహరించి కొత్త విధానం తీసుకొస్తామని కేజ్రివాల్ సర్కార్ ప్రకటించింది.
కొత్త ఎక్సైజ్ పాలసీ అమలుపై సీబీఐ విచారణకు లెఫ్టినెంట్ గవర్నర్ సిఫారసు చేయడంతో ఢిల్లీ ప్రభుత్వం నగరంలో రిటైల్ మద్యం విక్రయాల పాత స్కీమ్ను ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. 2022-23కి కొత్త పాలసీని క్రమబద్ధీకరించేందుకు ఢిల్లీ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నందున వచ్చే ఆరు నెలల పాటు పాత ఎక్సైజ్ విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపింది. లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఆమోదం కోసం 2022-23 ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన ముసాయిదా ఇంకా పంపాల్సి ఉంది. 2021-22 ఎక్సైజ్ పాలసీ ఈ ఏడాది మార్చి 31 తర్వాత రెండుసార్లు పొడిగించారు. ఇది జూలై 31తో ముగుస్తుంది.

2022-23 కొత్త ఎక్సైజ్ పాలసీలో మద్యం, ఇతర విషయాలతోపాటు హోమ్ డెలివరీ చేయాలని ఎక్సైజ్ శాఖ సిఫార్సు చేసింది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బీజేపీ మద్యం లైసెన్సీలు, ఎక్సైజ్ అధికారులను బెదిరించడానికి సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ను ఉపయోగించుకుందని ఆరోపించారు. కొత్త ఎక్సైజ్ పాలసీ విఫలమయ్యేలా మద్యం లైసెన్సులు, ఎక్సైజ్ శాఖ అధికారులను బెదిరించేందుకు బీజేపీ సీబీఐ, ఈడీలను వాడిందని సిసోడియా ఆరోపించారు.
కొత్త ఎక్సైజ్ పాలసీని ఉపసంహరించుకుని ప్రభుత్వ మద్యం దుకాణాలను తెరవాలని ఆదేశించామని సిసోడియా వెల్లడించారు. ఈ మధ్య కాలంలో ఎలాంటి గందరగోళం జరగకుండా పాత విధానం కొనసాగించమని ఆదేశాలు ఇచ్చామన్నారు. కొత్త పాలసీ అమల్లోకి వచ్చే వరకు ఆరు నెలల పాటు ఎక్సైజ్ పాలసీ పాత విధానాన్ని అమలుచేయాలని సిసోడియా ఇప్పటికే ఎక్సైజ్ శాఖను ఆదేశించారు.












Click it and Unblock the Notifications