గుజరాత్లోనూ కాంగ్రెస్కు ఝలక్.. 13 మంది ఎమ్మెల్యేలు జంపింగ్కు సిద్ధం
మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ సర్కారును కూల్చేసేదిశగా 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తనవైపునకు లాక్కున్న బీజేపీ.. గుజరాత్ లోనూ ఆపరేషన్ కమల్ ను ఉధృతం చేసింది. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ సీట్లు గెల్చుకునేలా కాంగ్రెస్ కు చెందిన 13 మంది ఎమ్మెల్యేలు ఫిరాయింపునకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
గుజరాత్లో కులాల మధ్య పోరాటమే ఈ పరిస్థితికి కారణంమని, రాజ్యసభ సీటు కోసం రాష్ట్రంలో ప్రాబల్యమున్న పాటిదార్లు, ఓబీసీలు తీవ్రంగా పోటీపడుతున్నారని, కాంగ్రెస్ లోని ఆయా వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు.. తమ కులంవాళ్లను గెలిపించుకోడానికి అవసరమైతే పార్టీని కూడా వీడేందుకు రెడీగా ఉన్నారని నేషనల్ మీడియా పేర్కొంది.
మధ్యప్రదేశ్ లో సోమవారం రాత్రి మొదలైన రాజకీయ సంక్షోభం మంగళవారానికి ముదిరిపాకాన పడింది. రాష్ట్రంలో కీలక నాయకుడిగా పేరుపొందిన జ్యోతిరాదిత్యా సింధియా కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. తన వర్గానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేలతోనూ ఆయన రాజీనామాలు చేయించారు. దీంతో కమల్ నాథ్ సర్కారు మైనార్టీలో పడినట్లయింది. రెబల్ ఎమ్మెల్యేలందరూ ప్రస్తుతం బెంగళూరులో మకాం వేశారు.
ఇంకొద్దిగంటల్లో జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఆయనను రాజ్యసభకు పంపనున్న బీజేపీ.. ఆపై మోదీ కేబినెట్ లో పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్ లాగే మరో కాగ్రెస్ పాలిత రాష్ట్రం రాజస్థాన్ లోనూ బీజేపీ ఆపరేషన్ కమల్ ను ప్రయోగించనుందని, ఎంపీలో సింధియా లాగా రాజస్థాన్ లో సచిన్ పైలట్ తో తిరుగుబాటు చేయించేందుకు వ్యూహాలు పన్నుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.