మెట్రోలో ఇద్దరు ప్రధానుల సెల్ఫీ: టర్న్బుల్తో కలిసి అక్షర్ధామ్ ఆలయానికి మోడీ
రైల్లో ప్రయాణిస్తున్న సమయంలోనే టర్న్బుల్ మోడీతో సెల్ఫీ దిగారు. ఈ సందర్బంగా ఇద్దరి మధ్య కాసేపు సరదా సంభాషణ చోటు చేసుకుంది.
న్యూఢిల్లీ: భారత పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా ప్రధాని టర్న్బుల్ భారత ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి సెల్ఫీ దిగారు. ఈరోజు సాయంత్రం ఇద్దరు ప్రధానులు ఢిల్లీలోని మండి మెట్రో రైల్వే స్టేషన్ కు చేరుకుని అక్కడినుంచి కొద్దిసేపు మెట్రో రైల్లో ప్రయాణించారు. మెట్రో స్టేషన్ లోకి ప్రవేశిస్తున్న సమయంలో ప్రధాని మోడీ ప్రయాణికులకు అభివాదం చేశారు.
రైల్లో ప్రయాణిస్తున్న సమయంలోనే టర్న్బుల్ మోడీతో సెల్ఫీ దిగారు. ఈ సందర్బంగా ఇద్దరి మధ్య కాసేపు సరదా సంభాషణ చోటు చేసుకుంది. మెట్రో ప్రయాణం ద్వారా వీరిద్దరు అక్షర్ ధామ్ ఆలయానికి చేరుకున్నారు. ఆలయ పూజారులు ఇద్దరు ప్రధానులను పూలమాలలతో సత్కరించి సాదరంగా ఆహ్వానించారు.
అక్షర్ ధామ్ ఆలయం లోపల ఇద్దరు కలియ తిరిగారు. ఇదిలా ఉంటే, నాలుగు రోజుల పర్యటన కోసం ఆస్ట్రేలియా ప్రధాని టర్న్ బుల్ ఇండియాకు వచ్చారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడం కోసం ఇద్దరు ప్రధానుల మధ్య చర్చలు జరగనున్నాయి.