ఇండిగో ఎయిర్ లైన్స్ తగ్గింపు ధరలు.. రూ.777 నుంచి ప్రారంభం
రాయితీ టిక్కెట్ల పోరులోకి ఇండిగో ఎయిర్ లైన్స్ కూడా దిగింది. దేశీయ మార్గాలలో ఎంపిక చేసిన మార్గాలలో అన్నీ కలుపుకొని రూ.777కే టిక్కెట్లు ఆఫర్ చేస్తోంది.
ముంబై: రాయితీ టిక్కెట్ల పోరులోకి దేశంలోని ప్రముఖ ప్రైవేట్ ఎయిర్ లైన్స్ ఇండిగో కూడా దిగింది. దేశీయ మార్గాలలో తగ్గింపు ధరలను ఈ సంస్థ ప్రకటించింది. ఎంపిక చేసిన మార్గాలలో అన్నీ కలుపుకొని రూ.777కే టిక్కెట్లు ఆఫర్ చేస్తోంది.
ఈ ఆఫర్ కింద ఫిబ్రవరి 25 వరకే టిక్కెట్లు బుక్ చేసుకునే వీలుంది. అలాగే ఈ టిక్కెట్ల ద్వారా ఏప్రిల్ 27 వరకు ప్రయాణించే అవకాశం కల్పిస్తోంది. సెలెక్టడ్ సెక్టార్లో, సెలెక్టడ్ విమానాలకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని సంస్థ పేర్కొంది.
ఈ తగ్గింపు టిక్కెట్ల ధరలు అగర్తలా-గౌహతి, శ్రీనగర్-చండీగఢ్ మార్గాలలో రూ.777కే అందుబాటులో ఉండగా, చెన్నై-హైదరాబాద్ మార్గంలో మాత్రం రూ.999 చెల్లించాల్సి ఉంటుంది. ప్రయాణానికి 19 రోజుల ముందుగా బుక్ చేసుకోవాలని, సీట్లు పరిమితంగా ఉన్నాయని ఇండిగో తెలిపింది.
ఒకవేళ ప్రయాణాన్ని విరమించుకుని టిక్కెట్లు క్యాన్సిల్ చేసుకుంటే చట్టబద్ధమైన పన్నులు మాత్రమే తిరిగి చెల్లిస్తామని స్పష్టం చేసింది. ఈ ఆఫర్ కు సంబంధించి మరిన్ని వివరాలు, సందేహాలకు ఇండిగో ఎయిర్ లైన్స్ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలని సంస్థ కోరింది.