బదులిద్దాం: ఉగ్రదాడిపై పారికర్, సరిహద్దు దాటుదామా?
న్యూఢిల్లీ: యూరీ దాడులకు బాధ్యులను వదిలేది లేదని రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ స్పష్టం చేశారు. దేశ రక్షణలో 17 మంది అమరజవాన్ల ఎనలేని త్యాగం వృథాపోదని, పిరికి దాడులకు గట్టిగా బదులిద్దామని సైనికులకు ఆయన పిలుపునిచ్చారు. శ్రీనగర్లోని ఆస్పత్రికి వెళ్లి దాడిలో క్షతగాత్రులైన సైనికులను పరామర్శించారు.
పరిస్థితులను సమీక్షించారు. అనంతరం మాట్లాడుతూ.. అమరవీరులకు శిరసువంచి నమస్కరిస్తున్నానని, వారి త్యాగం వృథా పోదన్నారు. ఆర్మీ చీఫ్, ఇతర కమాండర్లతో సమీక్షించానని, బాధ్యులకు గట్టిగా బదులివ్వాలని ఆదేశించాలని చెప్పారు. ఆదివారం గోవాలో ఉన్న పారికర్.. కశ్మీర్లో దాడి సమాచారం అందగానే హుటాహుటిన శ్రీనగర్ వచ్చారు.
ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్తో కలిసి యూరీ సైనిక స్థావరాన్ని సందర్శించారు. ఉగ్రవాదులను మట్టుబెట్టే ఆపరేషన్కు నాయకత్వం వహించిన వారు ఆయనకు జరిగిందంతా వివరించారు. దాడి ప్రారంభమైన మొదటి పదిహేను నిమిషాల్లోనే ముగ్గురు ఉగ్రవాదులను తుదముట్టించినట్లు, అనంతరం మరో ఉగ్రవాదిని నిర్మూలించినట్లు చెప్పారు.
అయితే, అప్పటికే ఉగ్రవాదులు బాంబులతో దాడి చేయడంతో 13 మంది సైనికులు మంటలలో చిక్కుకుని ఆహుతయ్యారని తెలిపారు. ఉగ్రవాదులు సైనిక స్థావరం దాకా చొచ్చుకురావడం ఎలా సాధ్యమైందన్న దాని పైన పారికర్ సమీక్షించారు. శత్రువుపై ప్రతిదాడికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికపైన చర్చించారు.
దీనిపై ఉన్నతస్థాయిలో నిర్ణయం తీసుకోనున్నట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. నియంత్రణరేఖ వద్ద, లోతట్టు ప్రాంతాల్లో అదనపు భద్రత మోహరింపు పైనా సమాలోచన చేసినట్లు పేర్కొన్నాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో నియంత్రణ రేఖ వద్ధ భద్రతా ఏర్పాట్లపై మంత్రి పారికర్ సైనిక ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారని ఆర్మీ అధికార ప్రతినిధి తెలిపారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని మంత్రి సూచించారన్నారు.
మోడీ నుంచి కేంద్రమంత్రుల దాకా
భారత దేశం ఎంత ఓపికగా ఉన్నప్పటికీ, పాకిస్తాన్ ఉగ్రవాదులను మన పైకి ఎగదోస్తోంది. దీంతో పాకిస్తాన్క గట్టి బుద్ధి చెప్పాలని చాలామంది భావిస్తున్నారు. ప్రధాని మోడీ నుంచి నుంచి కేంద్ర మంత్రులు, విపక్షాల దాకా.. సైన్యంలో ఉన్నతాధికారుల నుంచి విశ్రాంత జవాన్ల దాకా అందరి నోటా మన పైన దాడులకు పాల్పడుతున్న వారికి, పాల్పడేందుకు సహకరిస్తున్న వారికి బుద్ధి చెప్పాలనే భావిస్తున్నారు.
సరిహద్దు దాటుదామా?
యూరి దాడులకు కారకులైనవారు శిక్ష పడకుండా తప్పించుకోలేరని అంటున్నారు. ఈ నేపథ్యంలో భారతదేశం ముందున్న ప్రత్యామ్నాయాలు ఏమిటనే చర్చ సాగుతోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం సరిహద్దులు దాటి పొరుగుదేశంలోకి వెళ్లి నిర్దిష్ట లక్ష్యాలపై దాడులు చేయడం వల్లనే ఇస్లామాబాద్కు సరైన సందేశం పంపగలుగుతామని కొందరు విశ్లేషిస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా గత ఏడాది జూన్లో మణిపూర్లో 18 మంది భారత సైనికులను పొట్టన పెట్టుకున్న నాగా మిలిటెంట్లను వెంటాడుతూ.. మయన్మార్లో చొరబడి బుద్ధి చెప్పిన వైనాన్ని గుర్తు చేస్తున్నారు.
రాజకీయ నిర్ణయం
అయితే, ఈ తరహా దాడులు చేయడానికి రాజకీయ నిర్ణయం అవసరమంటున్నారు. గతంలో వాజ్పేయి హయాంలోనూ ఇలాంటి ప్రయత్నం జరిగిందనే సమాచారం ఉంది. ప్రస్తుత ప్రధాని మోడీ కూడా అత్యంత బలమైన నాయకుడు. పైగా పాక్ విషయంలో యూపీఏ కన్నా బీజేపీ భావజాలం కఠిన వైఖరితో ఉంటుంది. కాబట్టి కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే అవకాశమూ లేకపోలేదంటున్నారు. కానీ, దాడుల విషయంలో ముందుకెళ్లాలనే నిర్ణయం తీసుకునే ముందు చాలా అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
ఏకాకిని చేద్దాం
ఉగ్రదాడులకు ఉసిగొల్పుతున్న పాకిస్తాన్ను ఏకాకి చేయాలని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. యూరి దాడి నేపథ్యంలో రాజ్ నాథ్ రష్యా, అమెరికా పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఇదిలా ఉండగా, దాడులను ఎందుకు అడ్డుకోలేకపోతున్నామనే చర్చ సాగుతోంది. ఎల్వోసీ ప్రాంతంలో ఉన్న పరిస్థితులు, నిఘా లోపాలు ఎప్పటికప్పుడు ఉగ్రవాద మూకలకు పక్కాగా అందుతున్నాయని, ముఖ్యంగా ఆర్మీ ట్రూపులు మారుతున్న సమయంలో సెక్యూరిటీ సిబ్బంది ఏమరపాటును సైతం కనిపెట్టి ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారని అంటున్నారు.