బిజెపికి మరో దెబ్బ: అరుణాచల్పై సుప్రీం సంచలన తీర్పు
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ తర్వాత బిజెపికి మరో ఎదురు దెబ్బ తగిలింది. అరుణాచల్ ప్రదేశ్ వ్యవహారాలపై సుప్రీంకోర్టు బుధవారంనాడు సంచలన తీర్పు చెప్పింది. కాంగ్రెసు ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో నాబంతుకి ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంది.
అరుణాచల్ ప్రదేశ్పై గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. బిజెపి తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే బిజెపి ప్రయత్నాలకు గండి పడింది. డిసెంబర్ 9వ తేదీ తర్వాత గవర్నర్ తీసుకున్న నిర్ణయం చెల్లదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టును ప్రజాస్వామ్య విజయంగా కాంగ్రెసు అభివర్ణించింది. బిజెపి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు బిజెపికి చెంపదెబ్బ అని అభిప్రాయపడింది. జనవరి 26వ తేదీ నుంచి అరుణాచల్ ప్రదేశ్లో రాష్ట్రపతి పాలన ఉంది.
ముఖ్యమంత్రిపై 47 మంది శానససభ్యుల్లో 21 మంది తిరుగుబాటు చేయడంతో కాంగ్రెసు నేతృత్వంలోని నాబం తుకి ప్రభుత్వం డిస్మిస్ అయింది. నాటకీయమైన కాంగ్రెసు సభ్యుల తిరుగుబాటు నేపథ్యంలో గవర్నర్ జెపి రాజ్ఖోవా ముందస్తుగా శానససభ సమావేశాలను ఏర్పాటు చేశారు. ఈ సమావేశాల్లో ప్రతిపక్ష శాసనసభ్యులు కాంగ్రెసు తిరుగుబాటు సభ్యులతో కలిసి తుకిని, స్పీకర్ నాబం రెబియాను పదవుల నుంచి తొలగించారు.
గవర్నర్ ఆ విధమైన సమావేశాన్ని ఏర్పాటు చేయడాన్ని కూడా సుప్రీంకోర్టు బుధవారం తన తీర్పులో తప్పు పట్టింది. మాజీ స్పీకర్ ఆదేశాలతో శాసనసభ భవనానికి తాళాలు వేయడంతో ఆ ప్రత్యేక సమావేశం కమ్యూనిటీ సెంటర్లోలనూ హోటల్లోనూ జరిగింది. మెజారిటీ కోల్పోయినప్పటికీ పక్షపాత వైఖరితో ముఖ్యమంత్రికి తుకికి అనుకూలంగా వ్యవహరించారని, అందువల్ల శాసనసభ సమావేశాన్ని అలా ఏర్పాటు చేయడంలో తప్పులేదని గవర్నర్ అప్పట్లో అన్నారు.
కాంగ్రెసు తిరుగుబాటు నాయకుడు కలిఖో పుల్ ఫిబ్రవరి 19వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. ఆయనకు బిజెపి సభ్యులు 11 మంది, కాంగ్రెసు తిరుగుబాటు సభ్యులు 20 మంది మద్దతు ఇచ్చారు. డిసెంబర్ 9వ తేదీ తర్వాత తీసుకున్న గవర్నర్ నిర్ణయాన్ని చట్టవిరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.