నాడు విజయ్ - నేడు సతీషన్ ..! దక్షిణాది రాజకీయాల్లో కొత్త ట్రెండ్ ..!
దక్షిణాదిలో తెలుగు రాష్ట్రాల రాజకీయాలతో విసిగిపోయిన ప్రజలకు మొన్న తమిళనాడులో చోటు చేసుకున్న ఓ రాజకీయ పరిణామం ఊరట కలిగించగా... ఇవాళ అలాంటిదే మరో పరిణామం కేరళలో చోటు చేసుకుంది. పదవిలో ఉన్నంత కాలం రాజకీ ప్రత్యర్థులను ఎలా పరిగణించినా, వారు మాజీలు అయ్యాక మాత్రం కలిసి రాజకీయాలు ఎన్ని ఉన్నా నైతికత వేరు అన్న మెసేజ్ ఇచ్చేలా పరిణితి కనిపిస్తోంది. ఇవన్నీ చూస్తున్న తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతలకు మాత్రం ఎప్పటిలాగే చలనం లేదు.
కేరళలో తాజాగా సీఎల్పీ నేతగా ఎన్నికైన వీడీ సతీషన్ (VD Satheesan)ముఖ్యమంత్రిగా త్వరలో ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. అంతకు ముందే సతీషన్ సొంత పార్టీ కాంగ్రెస్ లో సీనియర్ నేతల్ని వరుసగా కలుస్తున్నారు. ఇదే క్రమంలో మాజీ ముఖ్యమంత్రి, కమ్యూనిస్ట్ నేత పినరయి విజయన్ ను కూడా ఆయన ఇంటికి వెళ్లి సతీషన్ కలిశారు. కేరళకు వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన విజయన్ ను కలిసి తాజా రాజకీయాలపై చర్చించారు. విపక్ష నేతగా ఆయన సహకారం కోరారు.

#WATCH | Keralam CM-designate VD Satheesan visits outgoing CM & LDF LoP Pinarayi Vijayan, at his residence in Thiruvananthapuram. pic.twitter.com/E0mdcs03gY
— ANI (@ANI) May 15, 2026
తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన టీవీకే అధినేత విజయ్ కూడా ఇదే తరహాలో మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత స్టాలిన్ ను ఆయన ఇంటికి వెళ్లి కలిశారు. రాజకీయాలకు అతీతంగా ఇతర నేతల ఆఫీసులకు వెళ్లి కలిసిన విజయ్.. స్టాలిన్ ను ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. రాజకీయ అంశాల చర్చ తర్వాత తన ప్రభుత్వానికి సహకారం కోరారు. ఉప్పూ నిప్పుగా సాగే తమిళనాడు రాజకీయాల్లో ఇదో చర్చనీయాంశమైంది. ఇవాళ సతీషన్ కేరళలో పినరయి విజయన్ ను కలవడం కూడా ఇలాగే చర్చనీయాంశంగా మారుతోంది. దక్షిణాది రాజకీయాల్లో ఇదో ట్రెండ్ గా మారుతోంది.














Click it and Unblock the Notifications