శశికళను జైల్లో కలిసిన నటుడు, ఎమ్మెల్యే, 40 నిమిషాలు చర్చ: అప్పుడు రజనీ అండ !
బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో చిన్నమ్మ శశికళతో ములాఖత్ అయిన మాట వాస్తవమే అని ఎమ్మెల్యే, నటుడు కరుణాస్ స్పష్టం చేశారు.
బెంగళూరు/చెన్నై: బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉన్న శశికళ నటరాజన్ కు కేడర్ (కార్యకర్తలకు) నుంచి పెద్ద సంఖ్యలో లేఖలు వస్తున్నాయని, వాటన్నింటికి చిన్నమ్మ చాల ఓపికగా సమాధానాలు ఇస్తున్నారని నటుడు, ఎమ్మెల్యే కరుణాస్ అన్నారు.
ముక్కొళత్తూరు పులిపడై నేత, తిరువాడవై అన్నాడీఎంకే (అమ్మ) ఎమ్మెల్యే, నటుడు కరుణాస్ చెన్నైలో మీడియాతో మాట్లాడారు. బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో చిన్నమ్మ శశికళతో ములాఖత్ అయిన మాట వాస్తవమే అని కరుణాస్ స్పష్టం చేశారు. ఆదివారం సుమారు 40 నిమిషాలు జైల్లో శశికళతో కరుణాస్ మాట్లాడారని వెలుగు చూసింది.
జయలలిత బిక్షతోనే ఈ స్థాయిలో
నటుడిగా జీవితం సాగిస్తున్న తాను ఈ రోజు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేస్తున్నానంటే అమ్మ జయలిత పెట్టిన బిక్ష, ఆమె ప్రధాన కారణం అని కరుణాస్ అన్నారు. జయలలిత మరణించినా ఆమెకు తాను జీవితాంతం రుణపడి ఉంటానని కరుణాస్ చెప్పారు.
జైల్లో మనోధైర్యంతో శశికళ
తన ఎదుగుదలకు చిన్నమ్మ శశికళ పాత్రకూడా ఉందని కరుణాస్ చెప్పారు. ఆ విశ్వాసంతోనే ఆమెను పరామర్శించడానికి తాను పరప్పన అగ్రహార జైలుకు వెళ్లానని, ఆమె ఎంతో మనోధైర్యంతో ఉన్నారని కరుణాస్ తెలిపారు.
లేఖలతో కాలం గడుపుతున్న శశికళ
అన్నాడీఎంకే పార్టీకి చెందిన నిజమైన కార్యకర్తల నుంచి జైల్లో ఉన్న శశికళకు పెద్ద సంఖ్యలో ఉత్తరాలు వెళ్తున్నాయని, వాటన్నిటినీ ఎంతో ఓపికగా చదువుతున్న శశికళ కార్యకర్తలకు సమాదానం ఇస్తూ మళ్లీ ఉత్తరాలు రాస్తున్నారని కరుణాస్ వివరించారు.
పన్నీర్ సెల్వం మనసు మార్చుకోవాలి
పన్నీర్ సెల్వం వేరుకుంపటి పెట్టడం శోచనీయమని కరుణాస్ అన్నారు. ఇకనైనా ఆయన మనస్సు మార్చుకుని అన్నాడీఎంకే (పళనిసామి వర్గం)తో కలిసి పని చెయ్యాలని హితవుపలికారు. పార్టీలో కొనసాగుతున్న పరిణామాలు సర్దుకోవాలనేది తన అభిమతం అని కరుణాస్ వివరించారు.
సీఎంతో మాట్లాడాను, ఆ విషయం కాదు !
మంగళవారం చెన్నైలోని సచివాలయంలో సీఎం పళనిసామిని కలిసిన వారిలో ఎమ్మెల్యే కరుణాస్ కూడా ఉన్నారు. అయితే తన నియోజక వర్గంలోని ప్రజల సమస్యల గురించి మాట్లాడటానికి తాను సీఎంను కలిశానని చెప్పారు. శశికళ ను కలిసి వెంటనే కరుణాస్ సీఎంను కలవడం ఇక్కడ కొసమెరుపు.
వార్నింగ్ ఇచ్చిన ప్రజలు
పన్నీర్ సెల్వం వర్గానికి మద్దతు ఇవ్వకుండా శశికళ వర్గంలో ఉన్న కరుణాస్ కు గతంలో ఆయన సొంత నియోజక వర్గం అయిన తిరువాడవై ప్రజలు వార్నింగ్ ఇచ్చారు. జయలలితకు ద్రోహం చేసిన శశికళ వర్గంలో ఉన్న నువ్వు మా నియోజక వర్గంలో అడుగు పెడితో కాళ్లు విరగొడతామని, తిరిగి వెళ్లలేవని హెచ్చరించారు.
రజనీకాంత్ ను ఆశ్రయించిన కరుణాస్
తన నియోజక వర్గం ప్రజలు బహిరంగంగా దాడి చేస్తాం అంటూ హెచ్చరించడంతో అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసిన కరుణాస్ తరువాత సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంటికి వెళ్లి ఆయన్ను ఆశ్రయించారు. రజనీకాంత్ ఆశీస్సులు తీసుకున్న తరువాత ఎమ్మెల్యే కరుణాస్ బయట తిరగడానికి ధైర్యం చేశారనే విషయం తెలిసిందే.