బెంగళూరు జైల్లో శశికళ, తీహార్ జైల్లో దినకరన్ తో ఎమ్మెల్యేల భేటీ: ఏం జరుగుతోంది!
న్యూఢిల్లీ/బెంగళూరు: తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిన సమయంలో అన్నాడీఎంకే (అమ్మ వర్గం) పార్టీ ఎమ్మెల్యేలు జైల్లో ఉన్న శశికళను కలవడం పెద్ద చర్చకు దారితీసింది. ఇంతకాలం శశికళకు దూరంగా ఉన్న ఎమ్మెల్యేలు ఇప్పుడు మళ్లీ ఆమెను దర్శించుకుని జైలు రాజకీయాలు మొదలుపెట్టారు.
షాక్: సీఎం పబ్లిక్ మీటింగ్ కు వంద మంది: పన్నీర్ సెల్వం మీటింగ్ కు లక్ష మంది!
బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార జైల్లో ఉన్న శశికళతో భేటీ అయిన వెంటనే ఎమ్మెల్యేలు ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్న టీటీవీ దినకరన్ తో భేటీ అయ్యారు. తమిళనాడులో ప్రస్తుతం నెలకొన్న రాజకీయాలపై శశికళ, టీటీవీ దినకరన్ తో చర్చించారని సమాచారం.
పళనిసామి రాజకీయం !
బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న శశికళను అన్నాడీఎంకే (అమ్మ) పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వెట్రివేల్, తంగ తమిళ సెల్వన్ కలిశారు. తమిళనాడు సీఎం పళనిసామి సూచన మేరకే ఎమ్మెల్యేలు ఇద్దరూ శశికళను కలిశారని తెలిసింది.
దూరం పెట్టిన శశికళ, ఇప్పుడు ఇలా !
బంధువులు, పార్టీ నాయకులతో భేటీ కావడానికి తనకు ఇష్టం లేదని కొంత కాలం నుంచి దూరంగా ఉన్న శశికళ ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలతో మాట్లాడటం చర్చకు దారితీసింది. తమిళనాడు రాజకీయాల గురించి ఎమ్మెల్యేలు వెట్రివేల్, తంగ తమిళ సెల్వన్ చిన్నమ్మకు వివరించారని సమాచారం.
ఏం చెయ్యాలో చెప్పిన చిన్నమ్మ ?
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి ఇప్పుడు ఏం చెయ్యాలో అనే విషయం శశికళ ఎమ్మెల్యేలతో చెప్పారని ఆమె వర్గంలోని నాయకులు అంటున్నారు. పార్టీ నుంచి నన్ను, దినకరన్ ను దూరం పెట్టాలని పన్నీర్ సెల్వం వర్గం చేస్తున్న డిమాండ్ తో పాటుట అనేక విషయాలు శశికళతో చర్చించారని తెలిసింది.
పన్నీర్ సెల్వం ఎత్తులు చిత్తు !
పన్నీర్ సెల్వం ఎత్తులకు పై ఎత్తులు వెయ్యాలని, ఆయన వర్గంలోని ఎమ్మెల్యేలు దగ్గరకు తీసుకునేలా ప్లాన్ వెయ్యాలని శశికళ పళనిసామికి సూచించారని తెలిసింది. ఇదే సమయంలో పార్టీ కార్యకలాపాల విషయంలో తీసుకోవలసిన నిర్ణయాలు శశికళ పూసగుచ్చినట్లు వివరించారని తెలిసింది.
తీహార్ జైల్లో దినకరన్ తో భేటీ
శశికళను భేటీ అయిన తరువాత ఎమ్మెల్యేలు ఉల్లాసంగానే జైలు నుంచి బయటకు వచ్చారని తెలిసింది. తరువాత చిన్నమ్మ ఆదేశాల మేరకు ఇద్దరు నాయకులు ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్న టీటీవీ దినకరన్ తో భేటీ అయ్యారు. తరువాత పలు విషయాలపై టీటీవీ దినకరన్ తో ఎమ్మెల్యేలు చర్చించారని తెలిసింది.
బెయిల్ ఇప్పించండి చాలు
ఎన్నికల కమిషన్ కు రూ. 50 కోట్లు లంచం ఎర వేశారని టీటీవీ దినకరన్ ను ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తీహార్ జైల్లో ఉన్న టీటీవీ దినకరన్ కు బెయిల్ ఇప్పించడానికి ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. మొదట తనను జైలు నుంచి బయటపడేలా చూడాలని దినకరన్ ఎమ్మెల్యేలతో చెప్పారని తెలిసింది.
శశికళ, టీటీవీకి అండగా ఉండాలని
బెంగళూరు జైల్లో ఉన్న శశికళ, తీహార్ జైల్లో ఉన్న టీటీవీ దినకరన్ కు అండగా ఉండాలని ఎమ్మెల్యేలు వెట్రివేల్, తంగ తమిళ సెల్వన్ నిర్ణయించారని సమాచారం. అంతే కాకుండా పళనిసామి సూచనల మేరకే ఇద్దరు ఎమ్మెల్యేలు శశికళ, దినకరన్ ను కలిశారని అన్నాడీఎంకే (అమ్మ) వర్గాలు అంటున్నాయి.