నన్ను చంపేస్తాం అంటూ 32 సార్లు ఫోన్: శశికళ, దినకరన్ వర్గంపై కేసు పెట్టిన ఎంపీ !
అన్నాడీఎంకే (అమ్మ) తాత్కాలిక ప్రధాన కార్యదర్శి వీకే. శశికళ, ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ కు వ్యతిరేకంగా మాట్లాడితే చంపేస్తాం అంటూ బెదిరిస్తున్నారని అదే వర్గంలోని అరక్కోణం పార్లమెంట్ సభ్యుడు తిర
చెన్నై: అన్నాడీఎంకే (అమ్మ) తాత్కాలిక ప్రధాన కార్యదర్శి వీకే. శశికళ, ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ కు వ్యతిరేకంగా మాట్లాడితే చంపేస్తాం అంటూ బెదిరిస్తున్నారని అదే వర్గంలోని అరక్కోణం పార్లమెంట్ సభ్యుడు తిరుత్తణి జి. హరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జయలలిత మరణంపై విచారణ జరిపిస్తాం: స్టాలిన్ రివర్స్ గేర్, మన్నార్ గుడి క్లోజ్, పన్నీర్ తో !
శశికళ, దినకరన్ మద్దతు దారులు తనకు ఇప్పటి వరకు 32 సార్లు ఫోన్ చేసి చంపేస్తాం అంటూ బెదిరించారని, తనకు రక్షణ కల్పించాలని అరక్కోణం పార్లమెంట్ సభ్యుడు హరి తమిళనాడు పోలీసులను ఆశ్రయించాడు. ఫోన్ లో రికార్డు అయిన వారి గొంతు ఎవరిది ? అని పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
మాట్లాడితే లేపేస్తాం
అన్నాడీఎంకే (అమ్మ) వర్గంలోని వీకే. శశికళ నటరాజన్, టీటీవీ దినకరన్ కు వ్యతిరేకంగా మాట్లాడితే నిన్ను లేపేస్తాం అంటూ తనకు బెదిరింపు ఫోన్లు చేస్తున్నారని పార్లమెంట్ సభ్వుడు హరి ఆరోపిస్తున్నారు. పదే పదే ఫోన్లు చేసి బెదిరించారని అంటున్నాడు.
చెప్పింది గుర్తు పెట్టుకో
అన్నాడీఎంకే (అమ్మ) వర్గానికి శశికళ, దినకరన్ మాత్రమే నాయకులు అని హెచ్చరించారని హరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామికి మద్దతు ఇవ్వడంతో శశికళ, దినకరన్ అనుచరులు తన ప్రాణాలు తీస్తామని హెచ్చరిస్తున్నారని ఎంపీ హరి వాపోయాడు.
రాష్ట్రపతి ఎన్నికల్లో
ముఖ్యమంత్రి పళనిసామి, జైల్లో ఉన్న శశికళను కలిసి రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రామనాథ్ కోవింద్ కు మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని లోక్ సభ డిప్యూటి స్పీకర్ తంబిదురై చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని ఎంపీ హరి గుర్తు చేశారు.
స్వార్థం కోసం తంబిదురై
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ కు మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి సొంతంగా నిర్ణయం తీసుకున్నారని, శశికళతో ఆయన చర్చించలేదని హరి అంటున్నారు. అయితే సొంత లాభం కోసం లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై ఇలా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
సీఎం సొంత నిర్ణయం
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవ్వరికి మద్దతు ఇవ్వాలి అనే విషయంపై సీఎం ఎడప్పాడి పళనిసామి అన్నాడీఎంకే (అమ్మ) వర్గంలోని సీనియర్ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసి చర్చించి నిర్ణయం తీసుకున్నారని హరి గుర్తు చేశారు.
క్రెడిట్ శశికళకు ఇస్తారా ?
ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి ఏర్పాటు చేసిన సమావేశంకు తంబిదురై కూడా హాజరైనారని, ఇప్పుడు క్రెడిట్ శశికళకు ఇవ్వడం దారుణంగా ఉందని పార్లమెంట్ సభ్యుడు హరి మండిపడ్డారు. పార్టీలో అందరితో చర్చించిన తరువాతే పళనిసామి ఓ నిర్ణయం తీసుకున్నారని హరి గుర్తు చేశారు.
మెడపట్టి బయటకు !
శశికళ నటరాజన్, టీటీవీ దినకరన్ ను పార్టీ నుంచి మెడపట్టి బయటకు పంపించాలని మెజారిటీ శాతం ఎంపీలు, ఎమ్మెల్యేలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని, ఈ విషయం తాను మీడియా ముందు చెప్పడం వలనే తన ప్రాణాలు తీస్తామని బెదిరిస్తున్నారని పార్లమెంట్ సభ్యుడు హరి ఆరోపిస్తున్నారు. హరి ఫిర్యాదుపై పోలీసులు విచారణ మొదలుపెట్టారు.