ఆ రూల్తో పన్నీరు సెల్వంకు చెక్: జ్యోతిష్కులతో శశికళ?
అన్నాడీఎంకే అధినేత్రి, చిన్నమ్మ శశికళ ముఖ్యమంత్రి పదవి త్వరలో చేపడతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, చిన్నమ్మ శశికళ ముఖ్యమంత్రి పదవి త్వరలో చేపడతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పార్టీకి చెందిన పలువురు నేతలు కూడా ఆమె సీఎంగా బాధ్యతలు చేపడతారని, ఎప్పుడు అనేది ఆమె ఇష్టమని చెబుతున్నారు.
ముఖ్యమంత్రి బాధ్యతలు శశికళ ఇష్టమే: డేట్ కూడా ఫిక్స్!
ఆమె ముఖ్యమంత్రిగా చేపట్టడానికి పలు కోణాలు ఆలోచిస్తున్నారని అంటున్నారు. ముఖ్యంగా, జయలలిత మృతి చెందిన తర్వాత ఇప్పుడే సీఎం పదవి చేపడితే అధికారం కోసం అర్రులు చాచిన పేరు వినిపిస్తోందని ఆమె భావిస్తున్నట్లుగా తెలుస్తోందని అంటున్నారు.
అలాగే, అక్రమాస్తుల కేసు ఉంది. ఈ కేసుపై సుప్రీం కోర్టు ఎప్పుడైనా తీర్పు చెప్పవచ్చు. ఈ తీర్పు వస్తే సీఎం పదవి చేపట్టాలని భావిస్తున్నారని అంటున్నారు. మరో వాదన కూడా ఉంది. సీఎం పదవి కోసం ఆమె జ్యోతిష్కులను సంప్రదిస్తున్నట్లుగా కూడా చెబుతున్నారు.
ప్రముఖ జ్యోతిష్కుల నుంచి ఆమె సలహా కోరుతున్నారని తెలుస్తోంది. ఎప్పుడు పదవి చేపట్టాలనే విషయమై ఆమె అడుగుతున్నారంటున్నారు. సంక్రాంతి ముందు లేదా తర్వాత ఆమె సీఎంగా బాధ్యతలు స్వీకరించవచ్చునని అంటున్నారు. అదే జరిగితే ముఖ్యమంత్రి పీఠం కోసం పావులు కదుపుతున్న పన్నీరు షాకని చెప్పవచ్చు.
పీఠంపై ఎప్పుడైనా శశికళ
అన్నాడీఎంకే అధినేత్రిగా చిన్నమ్మను ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం అంగీకరించారు. కానీ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుండబెట్టేందుకు ఆయన సిద్ధంగా లేనట్లుగా కనిపిస్తోంది. ఇందుకోసం గతంలో ఆయన బీజేపీతో కలిసి పావులు కదిపినట్లుగా కూడా ఊహాగానాలు ఉన్నాయి. అయితే, పార్టీలో ఎక్కువ మద్దతు మాత్రం శశికళకు ఉండటం గమనార్హం.
ఈ రూల్తో పన్నీరుకు షాక్
తమ పార్టీ సంప్రదాయం ప్రకారం అన్నాడీఎంకే అధినేత్రిగా ఎవరు ఉంటే వారు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉంటారని నాయకులు చెబుతున్నారు. ఇప్పుడు శశికళ పార్టీ చీఫ్ కాబట్టి ఆమె సీఎంగా బాధ్యతలు చేపట్టాలంటున్నారు. పార్టీ సీనియర్ నేతల నుంచి జూనియర్ల వరకు అదే చెబుతున్నారు.
ఆమె ఇష్టమే
శశికళ ఎప్పుడు కావాలంటే అప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించవచ్చునని పార్టీ ప్రతినిధి, ఎంపీ మైత్రేయన్ కూడా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పీఠంపై ఎప్పుడు కూర్చుంటారన్నది చిన్నమ్మ ఇష్టమని, ఆమె ఎప్పుడు కావాలంటే అప్పుడు బాధ్యతలు చేపట్టవచ్చునన్నారు. తాము చెప్పడానికేం లేదన్నారు.
12న లేదా 18వ తేదీన
తమిళనాడు అధికార యంత్రాంగా ప్రభుత్వ సారథి మార్పుకోసం ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్టు ఓ ఉన్నతాధికారి తనతో చెప్పారని మైత్రేయన్ చెప్పారు. ఈ నెల 12 లేదా 18న శశికళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నట్టు సమాచారం ఉందని కూడా చెబుతున్నారు.
జయలలిత మృతిపై..
ఇదిలా ఉండగా, జయలలిత మృతి చెందిన తీరు అనుమానాస్పదంగా ఉందని ఆరోపిస్తూ అన్నాడీఎంకే పార్టీ బహిష్కరించిన రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప రాసిన లేఖపై కేంద్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. జయలలిత అనుమానాస్పదంగా మృతి చెందారని, సీబీఐ విచారణ జరిపించాలని శశికళ పుష్ప కేంద్ర హోం శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాశారు. రాజ్యసభ సభ్యురాలు రాసిన లేఖపై కేంద్ర ప్రభుత్వం స్పందించడం గమనార్హం.