శశికళకు హై కోర్టు నోటీసులు: పదవికి అర్హత ఉందా ? ఎందుకంటే !
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టడానికి వరుసగా ఐదేళ్లు పార్టీ సభ్యత్వం ఉండాలని, శశికళ నటరాజన్ కు ఆ అర్హత లేదని రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప మద్రాస్ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చలి శశికళ నటరాజన్ కు ఇప్పుడు చట్టపరమైన సమస్యలు ఎదురైనాయి. శశికళ నటరాజన్ ను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఎలా నియమిస్తారు ? అని రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప వేసిన పిటిషన్ ఇప్పుడు అన్నాడీఎంకేకి పెద్ద తలనొప్పిగా తయారైయ్యింది.
శశికళ నాటరాజన్ ను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఎలా నియమిస్తారు ? అంటూ ఆ పార్టీ నాయకులతో పాటు శశికళ నటరాజన్ కు మద్రాసు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు చట్టపరంగా ఏం సమాధానం చెప్పాలి ? అని అన్నాడీఎంకే నాయకులు ఆయోమయంలో పడ్డారు.
అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన శశికళ పుష్ప, ఆమె భర్త లింగేశ్వర తిలగం మద్రాసు హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమిళనాడు సోసైటీ రిజిస్ట్రేషన్ చట్టం 1975 ప్రకారం ఏదైనా పార్టీలో కీలక పదవి చేపట్టాలంటే ఆ పార్టీలో వరుసగా ఐదేళ్లు ఏదైనా పదవిలో కాని, కనీసం సభ్యత్వం కాని ఉండాలని కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు.

అయితే శశికళ నటరాజన్ ఐదు సంవత్సరాలు వసరుగా అన్నాడీఎంకే పార్టీలో సభ్యురాలుగా ఉండలేదనే పూర్తి వివరాలు కోర్టులో సమర్పించారు. 2011 డిసెంబర్ లో శశికళను పార్టీ సభ్యత్వం నుంచి తొలగిస్తున్నామని జయలలిత అప్పట్లో స్వయంగా ప్రకటించారని గుర్తు చేశారు.
తరువాత మనసు మార్చుకున్న జయలలిత 2012 మార్చి చివరిలో మళ్లీ తన స్నేహితురాలు నెచ్చెలి శశికళకు పార్టీ ప్రాథమిక సభ్యత్వం ఇచ్చారని అన్నారు. శశికళను తన వారసురాలిగా ప్రకటించడం జయలలితకు ఇష్టం లేదని ఎంపీ శశికళ పుష్ప, ఆమె భర్త లింగేశ్వర తిలగం న్యాయవాది విజయన్ కోర్టులో చెప్పారు.
అందుకు గతంలో జరిగిన కొన్ని సంఘటనలు కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు. తన రాజకీయ వారసురాలిగా శశికళను నియమించడానికి జయలలితకు ఇష్టం లేదని, అందుకే కౌన్సిలర్ పదవి కాని, ఎమ్మెల్యే పదవికి పోటీ చెయ్యడానికి కాని శశికళకు అవకాశం ఇవ్వలేదని చెప్పారు.

శశికళ మీద జయలలితకు అంత ప్రేమ ఉంటే ఆమెను రాజ్యసభకు పంపించేవారని, లేదంటే ఎమ్మెల్యే చేసి మంత్రి పదవి ఇచ్చేవారని, అమ్మకు ఇష్టం లేకపోవడం వలనే శశికళను రాజకీయాలకు దూరంగా పెట్టారని శశికళ పుష్ప న్యాయవాది విజయన్ కోర్టులో వివరించారు.
శశికళ పుష్ప తరపు న్యాయవాది విజయన్ కోర్టులో వాదనలు వినిపించారు. అన్నాడీఎంకే పార్టీలో శశికళ వరుసగా ఐదు సంవత్సరాలు పార్టీ సభ్యురాలిగా లేరని (2017 మార్చికి ఐదేళ్లు అవుతుంది) కోర్టులో చెప్పారు.
అంతే కాకుండా అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా పోటీ చెయ్యాలంటే ఎవరైనా సరే చట్ట ప్రకారం 21 రోజుల ముందు పార్టీ సభ్యులు అందరికి నోటీసులు ఇచ్చి తరువాత ఎన్నికలు జరిపించాలని గుర్తు చేశారు.

ప్రస్తుతం అందుకు విరుద్దంగా జరుగుతుందని శశికళ పుష్ప న్యాయవాది కోర్టులో వాదించారు. మద్రాసు హై కోర్టు న్యాయమూర్తి కే. కల్యాణసుందరం వీ.కే శశికళ నటరాజన్, అన్నాడీఎంకే పార్టీకి నోటీసులు జారీ చేసి సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు నెచ్చలి శశికళ, అన్నాడీఎంకే పార్టీ అయోమయంలో పడ్డారు.
చట్టపరంగా ఈ సమస్యను ఎలా ఎదుర్కొవాలి అంటూ న్యాయనిపుణులతో చర్చలు జరుపుతున్నారు. మొత్తం మీద పార్టీ నుంచి బహిష్కరణకు గురైన రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప అన్నాడీఎంకే నాయకులకు చుక్కలు చూపిస్తున్నారు.












Click it and Unblock the Notifications