మమ్మల్నే గెంటేస్తారా? మాకు తెలియకుండా చర్చలెందుకు? దినకరన్ ఆగ్రహం
తనకు ఎలాంటి సమాచారమివ్వకుండానే పన్నీర్ సెల్వం గ్రూప్ విలీనం గురించి చర్చలు నిర్వహించడం పట్ల అన్నాడిఎంకె డిప్యూటీ ప్రధాన కార్యదర్శి దినకరన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
చెన్నై:తనకు ఎలాంటి సమాచారమివ్వకుండానే పన్నీర్ సెల్వం గ్రూప్ విలీనం గురించి చర్చలు నిర్వహించడం పట్ల అన్నాడిఎంకె డిప్యూటీ ప్రధాన కార్యదర్శి దినకరన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్టీలో పన్నీర్ సెల్వం గ్రూప్ విలీనం విషయమై చర్చల వివరాలను దినకరన్ కు 9మంది కమిటీ సభ్యులు వివరించారు.అయితే ఈ చర్చల వివరాలను విన్న దినకరన్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారని సమాచారం.అడిగిన వారందరికీ మంత్రి పదవులు ఇచ్చి కోర్కెలు తీరుస్తున్నా ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
ఈ సమావేశానికి ఎవరు నేతృత్వం వహించారు. ఎందుకు చేయాల్సి వచ్చిందంటూ ప్రశ్నల వర్షం కురిపించారు దినకరన్. శశికళను తప్పించి ఆమె పదవిని పన్నీర్ సెల్వంకు ఇవ్వాలన్న ప్రతిపాదనపైనా ఆయన మండిపడినట్టు సమాచారం.
పార్టీ నుండి మమ్మల్నే తీసేస్తారా?, అంత ధైర్యముందా? , పార్టీ అంటే ఏంటో తెలుసా?, ఎలా నడపాలో తెలిసినవారెవరు ? ఇప్పుడు కొత్తగా మీకు కొమ్ములు మొలిచాయా ? అంటూ దినకరన్ చిందులు తొక్కారు. ఎమ్మెల్యేల్లో అధిక భాగం తమ వారేనని చెప్పారు. ఆ విషయం మరిచిపోయి మాట్లాడుతున్నారా? అంటూ ఆయన మంత్రులను నిలదీయడంతో మంత్రులు మౌనం దాల్చారట.
పార్టీ నుండి తమను బయటకు పంపి, పన్నీర్ సెల్వాన్ని దరిచేర్చుకోవాలనే ఆలోచన ఉంటే వెంటనే తుడిచేయాలని ఆదేశించారు. అంతదాకా వస్తే ఏం చేయడానికైనా తాను వెనుకాడబోమని దినకరన్ తేల్చి చెప్పారని విశ్వసనీయ సమాచారం. అయితే మంత్రులు మాత్రం ఇది అందరి అభిప్రాయం. పార్టీ అభివృద్ది కోసమే ఇలాంటి నిర్ణయం తీసుకొన్నాం. పరిణామాలు చేయి దాటే వరకు కాకుండా మీరే రాజీనామా చేస్తే మంచిదనేది అందరి అభిప్రాయం. లేకుంటే అంటూ తమ అభిప్రాయాన్ని ఆయనకు అర్థమయ్యేలా సూచించారు. దాంతో ఆయన మౌనం దాల్చినట్టు తెలిసింది.
ఎంతసేపటికీ దినకరన్ నుండి సమాధానం రాకపోవడంతో బయటికొచ్చిన మంత్రులు నేరుగా సచివాలయానికి వెళ్ళి జరిగిన విషయం గురించి సీఎంకు వివరించినట్టు సమాచారం. అయితే కమిటీ వెళ్ళిపోయాక దినకరన్ తనకు అత్యంత సన్నిహితులుగా పేరుగాంచిన ఎమ్మెల్యే వెట్రివేల్, మంత్రులు దిండుగల్ శ్రీనివాసన్, కెఎ సెంగోట్టయ్యనలను మరోమారు పిలిపించుకొని మాట్లాడినట్టు సమాచారం.