పన్నీర్ సెల్వం, పళనిసామి వర్గాల చర్చలకు స్వస్తి: తలుపులు మూసేశారు !
అన్నాడీఎంకేలోని రెండు వర్గాలను ఏకం చెయ్యాలని గత వారం రోజుల నుంచి ఎగిరెగిరిపడిన ఆపార్టీ నాయకులు చివరికి చితకలపడ్డారు. పన్నీర్ సెల్వం, ఎడప్పాడి పళనిసామి వర్గాలు తాత్కాలికంగా విలీనం చర్చలకు స్వస్తిపలికా
చెన్నై: అన్నాడీఎంకేలోని రెండు వర్గాలను ఏకం చెయ్యాలని గత వారం రోజుల నుంచి ఎగిరెగిరిపడిన ఆపార్టీ నాయకులు చివరికి చితకలపడ్డారు. ఇరు వర్గాల విలీన చర్చలకు స్వస్థి పలికి అన్నాడీఎంకే పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) శత జయంతి ఉత్సవాలపై దృష్టిపెట్టారు.
జయలలిత మరణం తరువాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల కారణంగా అన్నాడీఎంకే పార్టీ నాయకులు రెండు వర్గాలుగా చీలిపోయారు. జయలలిత ప్రాతినిథ్యం వహించిన ఆర్ కే నగర్ ఉప ఎన్నికల సందర్బంగా ఎదురైన అనుభవాలు దృష్టిలో పెట్టుకుని రెండు వర్గాలు తిరిగి ఏకం కావాలని నిర్ణయించారు. అయితే రెండు వర్గాల దూకుడు కారణంగా విలీన చర్చలు అటకెక్కాయి.
పిల్లిమొగ్గలు వేశారు
రెండు వర్గాల రాజీపై పన్నీర్ సెల్వం వర్గం ప్రధానంగా రెండు డిమాండ్లు తెరమీదకు తీసుకు వచ్చింది. జయలలిత మరణంపై సీబీఐ విచారణ జరిపించాలని, తమ ప్రధాన శత్రువైన వీకే శశికళ నటరాజన్, ఆమె కుటుంబ సభ్యులను పార్టీ నుంచి దూరం పెట్టాలనే రెండు డిమాండ్లు చేసింది.
లేఖలు వెనక్కి తీసుకోవాలి
పన్నీర్ సెల్వం వర్గం మరో అడుగు ముందుకు వేసి శశికళ మా పార్టీ ప్రధాన కార్యదర్శి, టీటీవీ దినకరన్ ఉప ప్రధాన కార్యదర్శి అంటూ ఎన్నికల కమిషన్ కు ఇచ్చిన ప్రమాణ పత్రాలు వెనక్కి తీసుకోవాలని పన్నీర్ సెల్వం మరో డిమాండ్ తెరమీదకు తీసుకు వచ్చింది.
పళనిసామి వర్గం కౌంటర్
పన్నీర్ సెల్వం సీఎంగా పని చేస్తున్న సమయంలో జయలలిత మరణంపై సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించలేదని ఎడప్పాడి పళనిసామి వర్గం వాదన లేవనెత్తి పన్నీర్ సెల్వం వర్గానికి కౌంటర్ వేసింది.
శశికళ విషయంలో వేరే మాటలేదు
అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నిక విషయం ఎన్నికల కమిషన్ విచారణలో ఉన్నందున తాము ఎలాంటి హామీ ఇవ్వలేమని ఎడప్పాడి పళనిసామి వర్గం దాటవేసింది. శశికళ విషయంలో మీరు ఏమీ చెయ్యలేకపోతే మాతో చర్చలు ఎందుకు అంటూ పన్నీర్ సెల్వం వర్గం మండిపడుతోంది.
ఇద్దరూ ఇద్దరే
శశికళ విషయంలో మీరు ఏమీ చెయ్యలేమంటున్నారని మండిపడిన పన్నీర్ సెల్వం వర్గం మరో కొత్త డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చింది. అన్నాడీఎంకే పార్టీ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన శశికళ ఫోటోలు, బ్యానర్లు, ఫ్లెక్సీలు పూర్తిగా తొలగించాలని పన్నీర్ సెల్వం వర్గంలోని సీనియర్ నాయకుడు మధుసూదనన్ బాంబు పేల్చారు.
రెండాకుల చిహ్నం
ఇరు వర్గాలు ఇలా పోటీ పడుతుంటే రెండాకుల చిహ్నం ఎవ్వరికీ రాకుండా పోతుందని అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ దెబ్బతో రాజీ కోసం ఇరు వర్గాలు ఏడుగురు సభ్యులతో కమిటీలు వేసినా చివరికి ఫలితం లేకపోయింది.
ఎంజీఆర్ శత జయంతి ఉత్సవాలు
పన్నీర్ సెల్వం, ఎడప్పాడి పళనిసామి వర్గాలు తాత్కాలికంగా విలీనం చర్చలకు స్వస్తిపలికారు. జూన్ 8, 9 తేదీల్లో జరగనున్న ఎంజీఆర్ జయంతి ఉత్సవాలపై దృష్టిపెట్టారు. అన్నాడీఎంకే పార్టీని కాపాడుకోవాలనే ప్రజల నినాదానికి తాము విశ్వాసపాత్రులుగా ఉన్నామని పన్నీర్ సెల్వం వర్గం అంటున్నది.