విషాదం: రోడ్డు ప్రమాదంలో అన్నాడీఎంకే ఎంపీ మృతి
చెన్నై: అన్నాడీఎంకే పార్టీలో విషాదం చోటుచేసుకుంది. ఆ పార్టీకి చెందిన ఎంపీ ఎస్ రాజేంద్రన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. శనివారం తెల్లవారుజామున తిండివనం దగ్గర ఆయన ప్రయాణిస్తున్న కారు డివైడర్ను ఢీకొట్టడంతో మృతి చెందారు. రాజేంద్రన్ విల్లుపురం నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. తైలాపురంలో పీఎంకే వ్యవస్థాపకుడు రామదాస్ ఇచ్చిన విందుకు హాజరై తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
కారు ప్రమాదం చాలా తీవ్రంగా జరిగినట్లు కనిపిస్తోంది. డివైడర్ను ఢీకొట్టిన తర్వాత కారు బోల్తా కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే రాజేంద్రన్ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మిగతా వారంతా చికిత్స పొందుతున్నారు. అయితే ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.
యూనివర్శిటీ ఆఫ్ మద్రాస్ నుంచి తమిళ సాహిత్యంలో రాజేంద్రన్ డిగ్రీ పొందారు. విల్లుపురం నుంచి 16వ లోక్సభకు పోటీ చేసి గెలుపొందారు. ఫర్జిటైజర్స్ , కెమికల్స్ పై నియమించిన స్టాండింగ్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. అంతేకాదు సివిల్ ఏవియేషన్ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా కూడా ఆయన సేవలందించారు. రాజేంద్రన్కు భార్య , కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.