ఆంధ్రాకు ప్రత్యేక హోదా, మోడీ డైరెక్షన్, అన్నాడీఎంకే ఎంపీల డ్రామా, పన్నీర్ సెల్వం !
న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం మీద తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే ఎంపీలు ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని తెలుగుదేశం, వైఎస్ఆర్ సీపీ ఎంపీలో ఆందోళన చేస్తున్న సమయంలో తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ ఎంపీలు సైతం మోడీ డైరెక్షన్ లో మా డిమాండ్లు నెరవేర్చాలని ఆందోళనకు దిగారు. అయితే తమిళనాడు అసెంబ్లీ సమావేశంలో పన్నీర్ సెల్వం మరోలామాట్లాడి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు.
తెలుగుదేశం డిమాండ్ !
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించి తిరుగుబాటు చేస్తున్నది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలుగుదేశం ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు.
వైఎస్ఆర్ సీపీ
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని లోక్ సభ, రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు ఆందోళన చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని అనేక పార్టీలు తెలుగుదేశం, వైఎస్ఆర్ సీపీకి మద్దతు ఇస్తున్నాయి.
నరేంద్ర మోడీ రాజకీయం
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని తెలుగుదేశం, వైఎస్ఆర్ సీపీ ఎంపీలు డిమాండ్ చేస్తున్న సమయంలో మన సమస్యల్ని పక్కదారి పట్టించడానికి ప్రధాని నరేంద్ర మోడీ అన్నాడీఎంకే ఎంపీలతో ఆందోళన చేయించి ప్రత్యేక హోదా డిమాండ్ ను పక్కదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
డీఎంకే డిమాండ్
సోమవారం తమిళనాడు శాసన సభ సమావేశాల్లో కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, శాసన సభలో ప్రధాన ప్రతిపక్షనాయకుడు ఎంకే. స్టాలిన్ డిమాండ్ చేశారు.
పన్నీర్ సెల్వం చేతికి కీ !
కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చెయ్యడానికి కేంద్ర ప్రభుత్వానికి మార్చి 29వ తేదీ వరకు అవకాశం ఇచ్చి చూద్దామని తమిళనాడు ఉఫ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సోమవారం అసెంబ్లీ సమావేశంలో ప్రతిపక్షాలకు మనవి చేశారు.
చెన్నైలో ఇలా, ఢిల్లీలో అలా
కేంద్ర ప్రభుత్వానికి సమయం ఇద్దామని శాసన సభ సమావేశంలో తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం చెప్పిన సందర్బంలో అన్నాడీఎంకే పార్టీకి చెందిన ఎంపీలు ఢిల్లీలోని పార్లమెంట్ హాలు బయట కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చెయ్యాలని నిరసన వ్యక్తం చేస్తూ ప్లేకార్డులు ప్రదర్శించి, ధర్నా చేసి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా డిమాండ్ ను పక్కదోవపట్టించడానికి ప్రయత్నించారు.
బీజేపీ డ్రామా
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సెంటిమెంట్ ను పక్కదోవపట్టించడానికి, పార్లమెంట్ సమావేశాలను రద్దు చేయించడానికి కేంద్ర ప్రభుత్వంలోని కొందరు పెద్దలు తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే పార్టీ ఎంపీలను పావులుగా వాడుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. అందుకే తమిళనాడు ప్రభుత్వం ఒక విధంగా, ఢిల్లీలో అన్నాడీఎంకే ఎంపీలు మరో విధంగా ప్రవర్థిస్తున్నారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.