రెండాకుల పంచాయితీలో నెగ్గేదెవరు?: పన్నీర్ వర్సెస్ శశికళ, నేడే సీఈసీ తుది విచారణ
ఏప్రిల్ 12న ఆర్కేనగర్ ఉపఎన్నిక నేపథ్యంలో గురువారంతో నామినేషన్ల పర్వం ముగియనుంది. దీంతో పార్టీ గుర్తుపై ఏదో ఒకటి తేల్చాల్సిన పరిస్థితి నెలకొంది.
చెన్నై: అమ్మకు తామంటే తామే అసలైన రాజకీయ వారసులమన్న భావనలో ఉన్న పన్నీర్ సెల్వం, శశికళ అధికారం కోసం ఎంతలా తలపడ్డారో.. ఇప్పుడు పార్టీ చిహ్నాం కోసం కూడా అంతలా తలపడుతున్నారు. అయితే వీరిద్దరిలో పార్టీ చిహ్నాం రెండాకుల గుర్తును ప్రధాన ఎన్నికల కమిషన్ (సీఈసీ) ఎవరికి కేటాయిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. బుధవారం నాడు దీనికి సంబంధించి సీఈసీ తుది విచారణ జరగనుండటంతో తీర్పు ఎవరికి అనుకూలంగా వస్తుందనేది చర్చనీయాంశంగా మారింది.
ఇకపోతే చిన్నమ్మ మీద తిరుగుబాటు బావుటా ఎగరేస్తూ వస్తున్న పన్నీర్ సెల్వం.. పార్టీ గుర్తును తానే దక్కించుకుని రెండాకుల సెంటిమెంటుతో రాజకీయంగా తిరిగి పుంజుకోవాలనే యోచనలో ఉన్నారు. చిన్మమ్మ శశికళ సైతం రెండాకుల గుర్తును తన నుంచి చేజారిపోకుండా జాగ్రత్తపడుతున్నారు. ఈ మేరకు పన్నీర్ సెల్వం చేసిన ఫిర్యాదులకు శశికళ పలుమార్లు సీఈసీకి వివరణ కూడా ఇచ్చుకున్నారు.
పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగే అర్హత శశికళకు లేదంటూ పన్నీర్ సెల్వం సీఈసీకి ఫిర్యాదు చేయడంతో.. సీఈసీ శశికళ వివరణ కోరింది. దీంతో సీఈసీ కేంద్రంగా శశికళ, పన్నీర్ మధ్య వాదోపవాదనలు జరుగుతూ వస్తున్నాయి. ఎట్టకేలకు నేడు తుది విచారణకు సీఈసీ సిద్దం కావడంతో. వీరిద్దరి భవితవ్యం నేటితో తేలిపోనుంది.
ఏప్రిల్ 12న ఆర్కేనగర్ ఉపఎన్నిక నేపథ్యంలో గురువారంతో నామినేషన్ల పర్వం ముగియనుంది. దీంతో పార్టీ గుర్తుపై ఏదో ఒకటి తేల్చాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకవేళ నేటి తుది విచారణలో కూడా దీనిపై స్పష్టత రాకపోతే.. కొన్నిరోజులు ఆ గుర్తును సీజ్ చేసి ఎవరికి కేటాయించకుండా ఉండే అవకాశం ఉంది. అలా గనుక జరిగితే ఇరు వర్గాల తమ అభ్యర్థులకు వేరే చిహ్నాలు వెతుక్కోవాల్సిందే.
మొత్తం మీద రెండాకుల సెంటిమెంటుతో ఆర్కేనగర్ లో సత్తా చాటాలని చూస్తోన్న పన్నీర్, శశికళ వర్గానికి ఎన్నికలకు ముందే సీఈసీ విచారణ ఓ పరీక్షలా తయారైంది. సీఈసీ తీర్పు ఎవరికి ప్రతికూలంగా వచ్చిన జనాల్లోకి సైతం ప్రతికూల సంకేతాలు వెళ్లే అవకాశాలు ఉండటంతో ఆ గుర్తు తమకే దక్కాలన్న ఆరాటంలో ఇరు వర్గాలు ఎదురుచూస్తున్నాయి.