అమ్మ ఫోటో లేదు: శశికళ ఫ్లక్సీలు ధ్వంసం, తమిళనాట సెగ
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ మీద తమిళనాడు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు చేపట్టిన శశికళ ఇప్పుడు సీఎం పదవి మీద మోజుపడి తన అనుచరులతో నానా హంగామా చేయిస్తున్నారని మండిపడుతున్నారు.
శశికళ సొంత జిల్లా అయిన తంజావూర్ లో ఆమెకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా తిరుచునాపల్లి (తిరుచ్చి)లో కూడా శశికళ ఫ్లక్సీలు, పోస్టర్లను ధ్వంసం చేశారు.
తమిళనాడు కాబోయే సీఎం శశికళ అంటూ జయలలిత, శశికళ ఫోటోలు పెట్టి పెద్ద ఎత్తున ఆమె అనుచరులు ఫ్లక్సీలు ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల జయలలిత ఫోటోలు లేకుండానే ఫ్లక్సీలు ఏర్పాటు చేశారు.
జయలలిత లేకుండా ఫ్లక్సీలు ఏర్పాటు చేస్తున్న శశికళ అనుచరుల మీద స్థానిక అన్నాడీఎంకే కార్యకర్తలు తిరగబడుతున్నారు. ఏమి అర్హత ఉందని శశికళను తమిళనాడు ముఖ్యమంత్రి చెయ్యాలని ప్రశ్నిస్తున్నారు.
తిరిచ్చిలోని సెంట్రల్ బస్ స్టాండ్, పోస్టుఫీస్, తిరుచ్చి సెంటర్ తదితర ప్రాంతాల్లో జయలలిత లేకుండా ఏర్పాటు చేసిన శశికళ ఫ్లక్సీలను ధ్వంసం చేశారు. కొన్ని చోట్ల జయలలిత ఫోటోలు ఉండటంతో ఆ ఫ్లక్సీలు ధ్వంసం చెయ్యకుండా శశికళ ఫోటోల మీద ఆవు పేడ కొట్టి నిరసన వ్యక్తం చేస్తున్నారు.
దక్షిణ తమిళనాడులో శశికళకు వ్యతిరేకంగా అన్నాడీఎంకే నాయకులు, కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. జయలలిత చనిపోయిన వెంటనే శశికళ అన్ని పదవులు లాక్కొవడానికి ఆమె తన అనుచరులను రెచ్చగొడుతున్నారని అన్నాడీఎంకే కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
పైకి మాత్రం తనకు ఏ పదవి వద్దు అని చెబుతున్న శశికళ లోలోపలే అన్నీ తన అనుచరుల దగ్గర చేయిస్తున్నారని ఆరోపించారు. శశికళ సొంత జిల్లాలో ఆమెకు వ్యతిరేకంగా ఆందోళనలు మొదలు కావడంతో అన్నాడీఎంకేలో వర్గ పోరు తారా స్థాయికి చేరింది.