సోషల్ మీడియా ద్వారా బీహార్ రాష్ట్రం దాటి ప్రసారం అవుతున్న ఎయిర్ దర్భాంగా కార్యక్రమాలు
పాట్నా: భారతదేశం డిజిటల్ దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు తమ సేవలను డిజిటలైజ్ చేయగా... తాజాగా ప్రసారభారతి ఆధ్వర్యంలో నడిచే ఆలిండియా రేడియో స్టేషన్లు, దూరదర్శన్ కేంద్రాలు ఇతర ప్రాంతీయ వార్తా కేంద్రాల సేవలను ప్రముఖ సోషల్ మీడియా ట్విటర్లో ప్రారంభించింది. ఇలా మొత్తం 260 యూనిట్లను ప్రారంభించింది. ఇందులో బీహార్లోని దర్భాంగా జిల్లా సోషల్ మీడియా వేదికను ఎక్కువగా వినియోగించుకుంటోంది. ఇది ఇంతలా సక్సెస్ అయ్యేందుకు దీని వెనకున్న 34 ఏళ్ల రణదీర్ ఠాకూర్ అనే ప్రోగ్రామ్ కోఆర్డినేటరే కారణం.
ఠాకూర్ 15 ఏళ్లు పాటు భారత నేవీలో పనిచేశారు. అక్కడే స్మార్ట్ ఫోన్ ద్వారా నేవిగేషన్ పద్దతులను తెలుసుకున్నాడు. అదే స్మార్ట్ ఫోన్ల ద్వారా ఆలిండియా రేడియో సర్వీసులను కూడా శ్రోతలకు అందించాలనుకుని అందుకు కృషి చేశారు. ఎక్కువమందికి చేరవేయాలనే ధ్యేయంతో సోషల్ మీడియా వేదికగా ఆలిండియా రేడియో సర్వీసుల సేవలను ప్రారంభించారు. టెక్నాలజీని వినియోగంలో ముందున్న ఠాకూర్ను వన్ ఇండియా పలకరించింది.
రేడియో పాపులారిటీ ఈ రోజుల్లో తగ్గిపోయిందికానీ... పూర్తిగా పడలేదన్న రణధీర్..గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా చాలామంది రేడియోను వింటున్నారని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ తీసుకొచ్చిన మన్ కీ బాత్ ప్రోగ్రాం రేడియోను మరో స్థానానికి తీసుకెళ్లిందని అన్నారు. మరోవైపు పట్టణ ప్రజలు కూడా రేడియో అంటే మక్కువ చూపుతున్నారని చెప్పారు. ప్రధాని డిజిటల్ ఇండియా గురించే ఎక్కువగా మాట్లాడుతారు కాబట్టి తమ రేడియో ప్రోగ్రాం ప్రజలకు చేరువయ్యేందుకు సోషల్ మీడియాను వేదికగా ఎంపిక చేసుకున్నట్లు రణధీర వెల్లడించారు.
రేడియో కార్యక్రమాలను ప్రమోట్ చేసుకునేందుకు డిజిటల్ టూల్స్ అయిన సౌండ్ క్లౌడ్, యూట్యూబ్ ఛానెళ్లను వినియోగించుకుంటున్నట్లు చెప్పారు. ప్రోగ్రామ్ ఎయిర్ అయ్యేముందు కొన్ని చిన్న వీడియోలను తయారు చేసుకుంటామని ఆయన చెప్పారు. ఉదాహరణకు స్లైడ్లు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్లాంటివి ముందుగానే తయారు చేసి పెట్టుకుంటామని చెప్పారు.
శ్రోతలను చేరుకునేందుకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నట్లు రణధీర్ తెలిపారు. చైనా తర్వాత భారత్లోనే అత్యధిక మొబైల్ వినియోగదారులున్నారని తెలిపిన ఠాకూర్...బీహార్లో ప్రతి రెండో వ్యక్తికి మొబైల్ ఫోన్ ఉందని తెలిపారు. దీంతో మొబైల్ ఫోన్ ఉన్న వ్యక్తికి తమ కార్యక్రమాలు చేరవేయాలని ఆలోచించినట్లు ఠాకూర్ వెల్లడించారు.
శ్రోతలు బయట తిరుగుతున్నప్పుడు తమవెంట రేడియో ఉండదు కానీ మొబైల్ ఫోన్ ఉంటుందని చెప్పిన ఠాకూర్... సోషల్ మీడియా ద్వారా తమ కార్యక్రమాలను చేరవేయాలన్న ఆలోచనకు వచ్చినట్లు చెప్పారు. ఏదైనా ప్రోగ్రాం ఎయిర్లోకి వెళ్లేముందు దాన్ని ప్రమోట్ చేయాలి. కానీ తమవద్ద సోషల్ మీడియా టీమ్ లేనందున... అన్నీ ముందుగానే ప్రిపేర్ చేసుకుని తానే స్మార్ట్ ఫోన్ ద్వారా ఎయిర్ దర్బాంగాని ఇద్దరి సహాయకులతో ప్రమోట్ చేస్తున్నట్లు చెప్పారు. ఇదంతా ప్రసారభారతి సీఈఓ సహకారం లేకపోతే సాధ్యమయ్యేది కాదంటున్నాడు ఠాకూర్.