ఫ్లైట్లో మాంసాహారం ఇచ్చిన మహిళా ఉద్యోగిని కొట్టిన సూపర్వైజర్
ముంబై: విమాన ప్రయాణికుడికి శాకాహారం బదులుగా మాంసాహారం ఇచ్చినందుకు సహచర ఉద్యోగినిపై మరో ఉద్యోగి దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనపై అందిన ఫిర్యాదుల ఆధారంగా ఎయిరిండియా విచారణను ప్రారంభించింది.
ఎయిరిండియా క్యాబిన్ కు చెందిన ఓ క్రూ సభ్యుడు తన జూనియర్ ఉద్యోగినిని చెంప మీద కొట్టాడు. ఆన్ బోర్డ్లో ఉన్న శాకాహారం తీసుకొన్న ప్రయాణికుడికి శాకాహారానికి బదులుగా మాంసాహారం ఇవ్వడమే దీనికి కారణం.
మార్చి 17న న్యూఢిల్లీ నుండి ఫ్రాంక్ఫర్ట్ వెళ్ళే విమానంలో ఈ ఘటన చోటు చేసుకొంది. కేబిన్ అంటెండెంట్ అయిన ఉద్యోగిని పొరపాటున బిజినెస్ క్లాస్ ప్రయాణికుడికి శాకాహారానికి బదులుగా మాంసాహార భోజనం అందించింది.
ఈ పొరపాటును గుర్తించిన ప్రయాణికుడు క్యాబిన్ సూపర్వైజర్కు సమాచారం అందించారు. కానీ, ఈ విషయమై ఆ ఉద్యోగిని ప్రయాణికుడి వద్దకు వెళ్ళి క్షమాపణలు కోరింది. అంతేకాదు, వెంటనే సదరు ప్రయాణికుడికి శాకాహార భోజనాన్ని ఇచ్చింది.
అయితే ఈ విషయమై క్రూ సూపర్వైజర్ ఆ మహిళా ఉద్యోగినిని నిలదీసి, ఆమె చెంప మీద కొట్టారు. దీనిపై బాధితురాలు ఎయిరిండియా ఇన్ఫైట్ సర్వీస్ డిపార్ట్మెంట్కు ఫిర్యాదు చేసింది.
న్యూఢిల్లీ ఫ్రాంక్ఫర్ట్ వెళ్ళే ఏఐ321 కేబిన్ క్రూ నుండి ఫిర్యాదు అందింది. దీనిపై అంతర్గత విచారణ జరుపుతున్నామని ఎయిరిండియా అధికార ప్రతినిధి ప్రకటించారు.