అచ్చం రిలయన్స్ జియోనే: ఎయిర్టెల్ కొత్త ఆఫర్
టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ తాజాగా తన ప్రీపెయిడ్ యూజర్లకు ఓ సరికొత్త స్పెషల్ ఆఫర్ను ప్రకటించింది. ఈ ఆఫర్ అచ్చం రిలయన్స్ జియో ప్లాన్ రూ.399 మాదిరిగానే ఉంది.
న్యూఢిల్లీ: టెలికాం రంగంలో సంచలనాలు సృష్టిస్తున్న రిలయన్స్ జియోకి కౌంటర్ ఇచ్చేందుకు టెలికాం దిగ్గజాలు ప్లాన్లను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బీఎస్ఎన్ఎల్, వొడాఫోన్, ఐడియా, ఎయిర్సెల్ వంటి సంస్థలు తమ యూజర్లను కాపాడుకోవడానికి కొత్త ప్రకటిస్తూనే ఉన్నాయి.
తాజాగా టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ తన ప్రీపెయిడ్ యూజర్లకు ఓ సరికొత్త స్పెషల్ ఆఫర్ను ప్రకటించింది. ఈ ఆఫర్ అచ్చం రిలయన్స్ జియో ప్లాన్ రూ.399 మాదిరిగానే ఉంది. ఎయిర్టెల్ నేడు ప్రకటించిన స్పెషల్ ఆఫర్ కింద రూ.399కు రోజుకు 1జీబీ డేటాను 84 రోజుల పాటు తన ప్రీపెయిడ్ యూజర్లకు అందించనున్నట్టు తెలిపింది.

ఎయిర్టెల్ వెబ్సైట్ ప్రకారం ఈ ఆఫర్ కేవలం 4జీ సిమ్తో 4జీ హ్యాండ్సెట్ వాడేవారికేనని తెలిసింది. ఈ ఆఫర్ను ఏ ఇతర ప్లాన్తో కలుపవద్దని ఎయిర్టెల్ పేర్కొంది. డేటాతో పాటు ఈ ప్లాన్లో అన్ని నెట్వర్క్లకు అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకునే సదుపాయం కలిగి ఉంది.
అంతేకాదు, ఎయిర్టెల్ మరో ప్లాన్ను కూడా ఆఫర్ చేసింది. రూ.244తో రీఛార్జ్ చేసుకుంటే 70 రోజుల పాటు రోజుకు 1జీబీ డేటాను అందించనున్నట్టు పేర్కొంది. ఈ ఆఫర్ కింద కేవలం ఎయిర్టెల్ నెట్వర్క్ కస్టమర్లకు మాత్రమే ఉచిత కాల్స్ చేసుకునే సదుపాయముంటుంది.
జియో తెరతీసిన ధరల యుద్ధంలో టెలికాం కంపెనీలు సతమతమవుతున్న సంగతి తెలిసిందే. టెలికాం దిగ్గజం ఎయిర్టెల్, ఐడియా కంపెనీలు భారీగా కుదేలవుతున్నాయి. గత నెలలో ఉచితంగా జియో ఫోన్ను లాంచ్ చేసి, మరింత పోటీ వాతావరణానికి జియో తెరతీసింది.












Click it and Unblock the Notifications