మోడీపై ఐశ్వర్య ప్రశంసల వర్షం: దేనికి సంకేతం?
ముంబై: ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ప్రముఖ బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ ప్రశంసల జల్లు కురిపించారు. దేశం కోసం మోడీ ఎంతో కష్టపడుతున్నారని, ప్రధాని పదవి నిర్వర్తించడం అంత సులువైన విషయం కాదని ఆమె పేర్కొన్నారు. ఓ జాతీయ టీవీ ఛానెల్కు ఇంటర్వ్యూలో ఈ మేరకు వ్యాఖ్యానించారు.
దేశం, దేశ ప్రజల మేలు కోసం ప్రధాని కష్టపడుతున్నారని ఐశ్వర్య అన్నారు. కాగా, వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మీరు రాజకీయ రంగ ప్రవేశం చేసే అవకాశముందా? అన్న ప్రశ్నకు ఐశ్యర్య రాయ్ నేరుగా సమాధానమివ్వలేదు. ప్రస్తుతం ఓ మంచి తల్లిగా, కూతురిగా, భార్య, బాధ్యతాయుతమైన భారత పౌరురాలిగా తాను విభిన్నమైన పాత్రలు పోషిస్తున్నాని తెలిపారు.
తన వృత్తి పట్ల తనకు సంతృప్తి ఉందని ఆమె పేర్కొంది. రాజకీయాల్లోకి వస్తారా? రారా? అన్న ప్రశ్నకు ఆమె కచ్చితంగా సమాధానం ఇవ్వకపోవడం గమనార్హం. తాను ఏమీ చెప్పలేనని, తన రాజకీయ ఎంట్రీపై సాధ్యాసాధ్యాలను చెప్పలేనని తెలిపారు.
ఐశ్వర్య రాజకీయాల్లోకి వచ్చేది, లేనిది కాలమే నిర్ణయించాల్సి వుంది. 'మీ జీవితంలో ఏవైనా కొత్త లక్ష్యాలు పెట్టుకున్నారా?' అన్న ప్రశ్నకు కాస్తా వేదాంత దోరణిలో ఐశ్యర్య సమాధానమిచ్చారు. జీవితమనేది ఒక ప్రయాణమని, అందులో ఎత్తుపల్లాలు ఉంటాయని చెప్పుకొచ్చారు.
బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ భార్యగా అమితాబ్ బచ్చన్ ఇంట కోడలిగా అడుగుపెట్టిన ఐశ్యర్య తాజాగా 'సరబ్జిత్' అనే బాలీవుడ్ చిత్రంలో నటించారు. మే 20న విడుదలకానున్న ఈ సినిమా ప్రపంచానికి మీడియా శక్తి ఎంటో చాటిచెబుతుందని ఐశ్వర్య వివరించారు.
కాగా, ఇటీవల నల్ల ధనం విదేశాలకు తరలించిన వారి జాబితాలో ఐశ్వర్యా రాయ్, అమితాబ్ బచ్చన్ పేర్లు ఉన్నాయంటూ పనామా పేపర్స్ వెల్లడించడం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.