యుపి సిఎం: మాటలు తూటాలే, ఎవరీ ఆదిత్యనాథ్?
మాటల తూటాలు పేలుస్తూ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడంలో యోగి ఆదిత్యనాథ్ దిట్ట. ఆయనను యుపి సిఎంగా చేయడం ద్వారా బిజెపి సంఘ్ పరివార్ ముద్రను వేసింది.
లక్నో : మహంత్ యోగి అదిత్యానాథ్ను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడం ద్వారా బిజెపి అధిష్టానం పూర్తి స్థాయిలో సంఘ్ పరివార్ ముద్ర వేసినట్లే భావించాలి. మహత్ యోగి ఆదిత్య నాథ్ అసలు పేరు అజయ్ సింగ్. ఆయన వయస్సు 45 ఏళ్లు. అయితే, అత్యంత చిన్న వయస్సులోనే 26 ఏళ్లకే ఆయన పార్లమెంటుకు ఎన్నికై రికార్డు సృష్టించారు. ఆయన రాజపూత్ కుటుంబానికి చెందినవారు. ఆయన గోరఖ్పూర్ మఠం మహంత్ లేదా ప్రధాన పూజారిగా ఉన్నారు.
లక్నోలోని కాన్షీరాం మెమోరియల్ మైదానంలో ఆయన రేపు ఆదివారం మధ్యాహ్నం రెండుంబావుకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గోరఖ్పూర్ ఎంపీగా ఉన్న ఆదిత్యనాథ్కు ప్రారంభం నుంచే ఆర్ఎస్ఎస్తో అనుబంధం ఉంది. 26 ఏళ్ల వయసులోనే ఆయన గోరఖ్పూర్ ఎంపీగా ఎన్నికయ్యారు. ఐదుసార్లు వరుసగా ఇక్కడనుంచే ఎన్నికయ్యారు. హిందూ యువ వాహినిని స్థాపించి నడుపుతూ వస్తున్నారు. ఆయనకు యూపీ పూర్వాంచల్లో గట్టి పట్టుంది.
యోగి ఆదిత్యనాథ్ తన మాటలనే తూటాలుగా పేలుస్తుంటారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ఆయనకు మరొకరి సాటి రారేమో అని కూడా అనిపిస్తూ ఉంటుంది. ఆ వివాదాస్పద వ్యాఖ్యలే ఆయనకు ఎక్కువ ప్రచారం కల్పించాయని చె్పపాలి. హిందూ అతివాది అయిన యోగి ఎన్నికల ప్రచారంలో కూడా హిందుత్వ ఎజెండాను ప్రయోగిస్తూ వచ్చారు.
ఇతర మతాలవారిని హిందువులుగా మార్చాలన్నదే ఆయన జీవిత లక్ష్యంగా చెప్తూ ఉంటారు. 2005లో ఉత్తర ప్రదేశ్లోని ఈటాలో 5 వేల మందికి పైగా హిందూ మతంలోకి మారారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తర ప్రదేశ్ను, భారతదేశాన్ని హిందూ జాతిగా మార్చే వరకు తాను విశ్రమించేది లేదన్నారు.
2007లో గోరఖ్పూర్ అల్లర్ల సమయంలో ఓ హిందూ బాలుడు మరణించాడు. మొహర్రం సందర్భంగా ముస్లింల ప్రదర్శన సందర్భంగా కొందరు జరిపిన కాల్పుల్లో ఆ బాలుడు మృతి చెందాడు. వెంటనే యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ హిందువులకు న్యాయం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. రద్దీగా ఉండే రోడ్డుపై కాగడాల ప్రదర్శన నిర్వహించి ఆ బాలుడికి శ్రద్ధాంజలి సభ నిర్వహించారు.
జిల్లా మేజిస్ట్రేట్ నిషేధాజ్ఞలు జారీ చేసినప్పటికీ యోగి పట్టించుకోలేదు. దీంతో సీఆర్పీసీ సెక్షన్ 151ఏ ప్రకారం ఆయనను జైలులో నిర్బంధించారు. ఆ తర్వాత ఆయనపై ఐపీసీ సెక్షన్లు 146, 147, 279, 506 ప్రకారం కేసులు పెట్టారు. సూర్య నమస్కారాలను చేయడం యోగాభ్యాసంలో భాగమని, దీనిని విమర్శించేవారు సముద్రంలో పడి చావవచ్చునని, లేదా చీకటి గదుల్లో మగ్గిపోవచ్చునని వ్యాఖ్యానించి సంచలనం సృష్టించారు.
బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్పై ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. షారూఖ్ను పాకిస్థాన్ ఉగ్రవాది హఫీజ్ సయీద్తో షారూఖ్ను పోల్చారు. ఈ దేశంలోని మెజారిటీ ప్రజలే షారూఖ్ను స్టార్ను చేశారని గుర్తు చేశారు. వారు ఆయన సినిమాలను బహిష్కరిస్తే ఆయన వీధిన పడాల్సి వస్తుందని అన్నారు. 2016 జనవరి 3న పఠాన్కోట్ దాడి జరిగిన మర్నాడు పాకిస్థాన్పై విరుచుకుపడ్డారు. సైతాన్నైనా మార్చవచ్చు కానీ పాకిస్థాన్ను మార్చలేమన్నారు.
సూర్యనమస్కారాలను వ్యతిరేకించేవారు దేశాన్ని విడిచి పోవచ్చునని ఆయన అన్నారు. సూర్య భగవానుడిలో కూడా మతతత్వాన్ని చూసేవారు సముద్రంలో మునగాలని లేదా మిగిలిన జీవితమంతా చీకటి గదుల్లో మగ్గాలని ఆయన అన్నారు.
యోగి ఆదిత్యనాథ్పై ఇప్పటికీ క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. అల్లర్లు, హత్యాయత్నం, ప్రాణాంతక ఆయుధాన్ని కలిగియుండటం, శ్మశానాల్లోకి చొరబడటం వంటి ఆరోపణలు విచారణలో ఉన్నాయి. చట్టాన్ని అమలు చేయవలసిన సంస్థలు తమ పాత్రకు న్యాయం చేయలేకపోయినపుడు సామాన్యుడు న్యాయం కోసం ప్రత్యామ్నాయ మార్గాల కోసం ఆలోచిస్తాడని యోగి చెప్తూ ఉంటారు.
2010 మార్చిలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీజేపీ జారీ చేసిన విప్ను ధిక్కరించిన ఎంపీల్లో యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు. కొన్నేళ్ళ క్రితం బయటపడిన ఓ వీడియోలో ఒక హిందూ బాలికను ఇస్లాంలోకి మారిస్తే, వంద మంది ముస్లిం మహిళలను తాము హిందుత్వంలోకి మారుస్తామని చెప్పినట్లు అందులో రికార్డు అయి ఉంది. దీనిపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ బలవంతపు మత మార్పిడులు చేసే హక్కు ఎవరికీ లేదన్నారు.