కిసాన్ మార్చ్... రైతులకు మద్దతుగా బయలుదేరిన అఖిలేశ్... అడ్డుకున్న పోలీసులు,ఉద్రిక్తత...
ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న రైతు ఆందోళనలకు మద్దతుగా సమాజ్వాదీ పార్టీ సోమవారం(డిసెంబర్ 7) కిసాన్ మార్చ్కి పిలుపునిచ్చింది. లక్నోలోని కన్నౌజ్ నుంచి ప్రారంభం కానున్న ఈ యాత్రలో పాల్గొనేందుకు బయలుదేరిన సమాజ్వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్ను పోలీసులు అడ్డుకున్నారు.దీంతో రోడ్డు పైనే బైఠాయించిన అఖిలేశ్... పార్టీ కార్యకర్తలు,మద్దతుదారులతో కలిసి అక్కడే నిరసనకు దిగారు. పోలీసుల తమను జైళ్లల్లో నిర్బంధించినా సరే కిసాన్ మార్చ్ను అడ్డుకోలేరని ఈ సందర్భంగా అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు.
బారికేడ్లు దాటుకుని మరీ...
అంతకుముందు అఖిలేశ్ ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు... ఆయన బయటకు అడుగుపెట్టకుండా బారికేడ్లు అడ్డుపెట్టారు. అయినప్పటికీ అఖిలేశ్ ఆ బారికేడ్లను దాటుకుని బయటకు రాగలిగారు. అనంతరం అఖిలేశ్ను పోలీసులు అడ్డుకోగా.. కార్యకర్తలు పెద్ద ఎత్తున కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కిసాన్ మార్చ్కి తమను అనుమతించేంత వరకూ అక్కడినుంచి కదిలేది లేదని రోడ్డుపై బైఠాయించారు.దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
13కి.మీ కిసాన్ మార్చ్కి ప్లాన్...
కన్నౌజ్లోని తతియా నుంచి తిర్వా వరకు 13కి.మీ మేర కిసాన్ మార్చ్ నిర్వహించాలని ఎస్పీ నిర్ణయించింది. అయితే ఇందుకు అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు.అయినప్పటికీ యాత్రలో పాల్గొనేందుకు బయలుదేరిన పలువురు ఎస్పీ కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. కన్నౌజ్ జిల్లా మెజిస్ట్రేట్ రాకేష్ మిశ్రా మాట్లాడుతూ... కరోనా ప్రోటోకాల్ నేపథ్యంలో ఎక్కువమంది ఒకేచోట గుమిగూడేందుకు అనుమతి లేదన్నారు. కిసాన్ యాత్రను రద్దు చేసుకోవాలని సమాజ్వాదీ పార్టీని కూడా కోరామన్నారు.
మార్చ్ను అడ్డుకోవడం అప్రజాస్వామికం : ఎస్పీ
సమాజ్వాదీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజేంద్ర చౌదరి మాట్లాడుతూ... తమ పార్టీ తలపెట్టిన కిసాన్ మార్చ్ను పోలీసులు అడ్డుకోవడం అప్రజాస్వామికం అన్నారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలపడం ప్రజల హక్కు అని... ప్రభుత్వం ఆ హక్కును కాలరాస్తోందని మండిపడ్డారు.కిసాన్ యాత్రకు అఖిలేశ్ యాదవ్ బయలుదేరగానే ప్రభుత్వానికి భయం పట్టుకుందన్నారు. కాగా,కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత 10 రోజులకు పైగా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా డిసెంబర్ 8న భారత్ బంద్కు పిలుపునిచ్చారు. ఈ బంద్కు పలు రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి.
Recommended Video